ఆమె పట్టిందల్లా బంగారమే..!

ఆమె పట్టిందల్లా బంగారమే..!

Saturday April 02, 2016,

3 min Read


ఫ్యాషన్ అనగానే కొంతమంది డిజైనర్లు పారిస్, లండన్, న్యూయర్క్ వైపు చూస్తుంటారు. అక్కడి ట్రెండ్స్ ఫాలో అవుతూ అదే పెద్ద తీస్మార్ ఖాన్ ఫ్యాషన్ అని ఫీలైపోతుంటారు. కానీ షీలా మాత్రం అలా కాదు...ఫ్యాషన్ కోసం పల్లెలవైపు చూసింది. మనం ఎక్కడైతే కొల్పోయామో అక్కడే వెతకమన్నారు పెద్దలు. ఆ మాటను పాటించింది షీలా.

షీలా ఇప్పుడు ఓ కొత్తతరం ఆంట్రప్రెన్యూర్. సంప్రదాయ విలువలను కాపాడుతూ చేతివృత్తులను రక్షణ కల్పిస్తూ...వారికి అంతర్జాతీయ గుర్తింపు ఇస్తూ...తన వ్యాపారాన్ని విస్తరించుకుంది. సంప్రదాయ చేతివృత్తులు అనగానే ఒకే తరహా ఉత్పత్తులు కనిపిస్తుంటాయి. అందుకే వాటికి మార్కెట్‌ విలువ తక్కువ అని షీలా భావించింది. అయితే తన ఆలోచనకు పదును పెట్టి సరికొత్త డిజైన్లతో ఓ చిన్న వర్క్ షాప్ స్టార్ట్ చేసింది. ట్రేలు, మగ్గులు, చిన్నపాటి ఫర్నిచర్ లాంటి వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయించింది. షీలా చేసిన తొలి ప్రయత్నంతోనే సక్సెస్ సాధించింది. 

image



కల సాకారం అయిన వేళ...!

2002, అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మహానగరం. స్మిత్ సోనియన్ ఫోక్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 24 దేశాల నుంచి నాలుగు వందల మంది ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, మేధావులు తరలివచ్చారు. ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరపాలని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. మరి అలాంటి ఫెస్టివల్ జరిగే ప్రదేశాన్ని అలంకరించాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ అనూహ్యంగా ఆ లక్కీఛాన్స్ షీలాకు దక్కింది. సుమారు 3,500 మీటర్ల క్లాత్‌తో ఆ ప్రాంగణాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దింది.

సరిగ్గా మూడేళ్లకు న్యూఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక ఫాబ్‌ ఇండియాకు 8000 చదరపు అడుగుల స్టోర్‌ని డిజైన్ చేసే ఛాన్స్ షీలాకే దక్కింది. ఒక ఆర్కిటెక్ట్‌ గా షీలా ప్రపంచ వ్యాప్తంగా పలు స్టోర్ల నిర్మాణంలో తన ప్రతిభను చూపించింది. ముఖ్యంగా జైపూర్‌, చెన్నై, దుబాయ్‌, గువాంగ్జు(చైనా)లలో పలు స్టోర్లను షీలా డిజైన్‌ చేశారు. ఒక సాధారణ గృహిణిగా ఆర్కిటెక్ట్‌ రంగంలోకి వచ్చిన షీలా ఒక ప్రపంచస్థాయి ఆర్టిస్టుగా ఎదిగింది.

షీలా తన ఆర్కిటెక్ట్‌ ప్రతిభను వినూత్న రీతిలో వినియోగిందించింది. జైపూర్‌లోని డెసర్ట్‌ ఆర్టిసన్స్‌ హాండిక్రాఫ్ట్‌ సీఈవోగా షీలా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. వెంటనే ఝంజ్ను, బంధేజ్‌, బగ్రు లాంటి సంప్రదాయ హస్తకళలను ఇప్పటి తరానికి ఎలా అందించాలి అనే ప్రణాళికలు వేసింది. మరుగున పడ్డ కళలకు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి, మార్కెట్‌కు పరిచయం చేసింది. రెండున్నరేళ్లు గడిచాయి... ఇంకేముంది కంపెనీ 300 శాతం వృద్ధి రేటును సాధించింది. అంతే కాదు సుమారు 2,500 మంది హస్తకళా నిపుణులకు జీవనోపాధి లభించింది. చాలామంది హస్తకళా నిపుణులు ఏకంగా కంపెనీలో షేర్‌ హోల్డర్లుగా మారారు.

image


ఇలా సుమారు 9 ఏళ్లు గడిచాయి. అంతే.. షీలా తన ఆంట్రప్రెన్యూర్‌ జీవితానికి సడెన్‌ గా బ్రేక్‌ ఇచ్చి.. కుటుంబసభ్యులతో గడిపింది. తిరిగి కెరీర్‌ స్టార్ట్‌ చేసిన షీలా.. మరో మైలురాయిని అందుకుంది. ఈసారి ఎకో టూరిజంపై దృష్టి పెట్టింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ సముద్రతీరంలో టర్టిల్‌ బీచ్‌ రిసార్ట్‌ను డెవలప్‌ చేసింది. అలాగే ఉత్తరాంచల్‌లో ఒక ఎకో హోటల్‌ను ఏర్పాటు చేసింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో హోటల్‌ను తీర్చి దిద్దింది. ఈ ఎకో హోటల్‌ కాన్సెప్ట్ నిజానికి చాలా వినూత్నమైనది. పచ్చటి అడవుల మధ్య ప్రకృతి రమణీయతతో అలరారే ఎకో హోటల్‌.. పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతినిస్తోంది. ఈ ఎకో హోటల్‌ను పూర్తిగా స్థానికులకు ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. ఇక్కడి జిల్లింగ్ టెర్రస్‌ పూర్తిగా లోకల్ మెటీరియల్ తోనే నిర్మించారు. అన్నట్టు ఈ హోటల్‌లోని వస్తువులన్నీ హస్తకళా వస్తువులే. 

అయితే ప్రస్తుత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని ఉపయోగించి హస్తకళలకు పూర్వవైభవం తెవచ్చు అనేది షీలా అభిప్రాయం. ముఖ్యంగా ఇంటర్నెట్‌ షాపింగ్‌ ను ఉపయోగించి హస్తకళలను ప్రపంచానికి పరిచయం చేయవచ్చని షీలా భావించారు. అలా హాండీక్రాఫ్ట్ మార్కెట్‌ను ప్రపంచానికి కనెక్ట్‌ చేసి అటు కళాకారులకు, ఇటు వినియోగదారులకు మధ్య ఉన్న అంతరాలను తొలగించింది.

కొంత మంది పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ మాటను నిజం చేసింది షీలా లున్కద్. తన మనసుకు నచ్చిన పనులను చేస్తూ బిజినెస్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.