గుజరాత్ కోటీశ్వరుడి కొడుకు హైదరాబాదులో కూలిపని చేశాడు

గుజరాత్ కోటీశ్వరుడి కొడుకు హైదరాబాదులో కూలిపని చేశాడు

Saturday August 12, 2017,

4 min Read

ఆరువేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం. చిటికేస్తే వందమంది పనివాళ్లు జీ హుజూర్ అంటారు. అయితే లగ్జరీ కారు.. లేదంటే విమానం. కాలుకింద పెట్టాల్సిన పనిలేదు. బడా వ్యాపారుల తనయులుగా కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికేయొచ్చు. మట్టి అంటకుండా, చెమట చిందకుండా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవచ్చు. ఆర్మాన్ సూట్ వేసుకుని డజను మంది అంగరక్షకులతో నడుస్తుంటే ఆ దర్పమే వేరు.

తండ్రి రిక్షా తొక్కి పైకొచ్చాడు కదాని కొడుక్కి కూడా రిక్షా కొనిపెట్టి తొక్కమనడం కరెక్ట్ కాదంటాడు ఓ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్. కరెక్టే. కానీ కొన్ని సందర్భాల్లో రిక్షా తొక్కే జీవితం ఎలా వుంటుందో.. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చామో కడుపున పుట్టిన వాళ్లకు తెలియాలంటే రిక్షా తొక్కాల్సిందే. జీవితం వడ్డించిన విస్తరే కావొచ్చు.. అంతమాత్రాన విస్తరి ఎలా కుడతారో నేర్చుకోవడంలో తప్పులేదు. హితార్ధ్ తండ్రి ఘన్ శ్యామ్ డొలాకియా సరిగ్గా ఇలాగే ఆలోచించాడు.

గుజరాత్ హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ అధినేత ఘన్ శ్యామ్ డొలాకియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ. 6వేల కోట్ల వ్యాపారాధినేత. అందరు తండ్రులు తన కష్టం కడుపున పుట్టినవాళ్లకు రాకూడదు అనుకుటారు. కానీ ఘన్ శ్యామ్ మాత్రం కష్టమంటే ఏంటో వాళ్లకూ తెలియాలి అంటారు. రేపు వాళ్ల లైఫ్ వాళ్లకుంది. కానీ ఎవరు చెప్పొచ్చారు..పూలమ్మిన చోట కట్టెలు అమ్మాల్సి వస్తే.. ఆస్తులు కరిగిపోతే సామాన్యుడిలా బతకాల్సి వస్తే.. ఆ బతుకు పాఠం తెలిసుండాలిగా.. మురికివాడల్లో అయినా బతికే ధైర్యం ఉండాలిగా. ఆఅందుకే కొడుకుంలందరికీ అగ్ని పరీక్ష పెట్టాడు.

image


హితార్ధ్. ఇటీవలే న్యూయార్కులో పైలట్ కోర్సు చదవి వచ్చాడు. తండ్రి పెట్టిన షరతు ప్రకారం వ్యాపారంలో సర్రున దూరిపోలేదు. ముందుగా నెల రోజుల టాస్క్ పూర్తి చేసిన తర్వాతే వ్యాపార సామ్రజ్యంలోకి ఎంట్రీ. చేతిలో ఒక కవరు. అందులో ఫ్లయిట్ టికెట్. జేబులో రూ. 500. ఎయిర్ పోర్టుకి వెళ్లాకగానీ తెలియలేదు తను వెళ్లేది హైదరాబాదుకి అని. ఆ పేరు అంతకు ముందు వినడమే గానీ ఎప్పుడూ రాలేదు.

ఏ భాష మాట్లాడుతారో.. ఆహారపు అలావాట్లు ఏంటో.. ఎక్కడ ఉండాలో.. ఏం చేయాలో అంతా ఆగమ్యగోచరం. మొత్తానికి విమానం ఎక్కడి హైదరాబాదులో దిగాడు. తను ఎవరో, తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఎవరికీ చెప్పొద్దు. నెలరోజుల పాటు ఒకే ఉద్యోగం కూడా చేయొద్దు. వారానికి ఒక జాబ్ చేయాలి. అవసరమైతే రెండు మూడు కూడా చేయాలి. ఇదీ తండ్రి పెట్టిన షరతు.

ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్ వచ్చాడు. ఎక్కడుండాలి అన్నది మొదటి ప్రశ్న. లాడ్జిలో ఉండాలా? రోడ్డుపక్కన పడుకోవాలా..? భయమేసింది. లాడ్జిల్లో అడిగితే 4వేలు అడ్వాన్స్ అడిగారు. కానీ అంత డబ్బులేదు. వేరోచోట ప్లేస్ దొరికింది. వంద రూపాయలు ఇమ్మన్నారు. అదేదో హాస్టల్లా ఉంది. ఉండటానికి కాస్త సౌకర్యంగానే ఉంది. అంతదూరం నుంచి ఇక్కడికెందుకు వచ్చావు అని చాలామంది క్రాస్ క్వశ్చన్ చేశారు. నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వచ్చాను అని చెప్పాడు. ఉద్యోగం కోసం తిరగని ఆఫీస్ లేదు. జాబ్ సరే, నీ రెజ్యూమ్ ఎక్కడ అని చాలాచోట్ల అడిగారు.

ఉద్యోగ వేటలో చాలామందిని కలిశాడు. ఒక్కొక్కరూ ఒక్కో అడ్వైస్ ఇచ్చారు. జాబ్స్ దొరికే ఏరియాల గురించి చెప్పారు. ఒకాయన సలహాతో అమీర్‌పేటలో దిగి లాల్‌బంగ్లా దగ్గర డీజీ టెలి సర్వీసెస్ అనే ఒక టెలీకాలర్‌ సంస్థకు వెళ్లాడు. అక్కడ తబుస్సం అనే మహిళ ఇతని మాటలు విని కదలిపోయింది. ముందుగా రూ.500 చేతిలోపెట్టింది. ఈ డబ్బుతో భోజనం చేసి, హైటెక్ సిటీ ఏరియాకు వెళ్లు అని సలహా ఇచ్చింది.

ఈ క్రమంలో మెక్ డోనాల్డ్స్ వాళ్లు జాబ్ ఇచ్చారు. అక్కడ ఐదు రోజులు చేశాడు. చాలెంజ్ ప్రకారం వారం తర్వాత దాన్ని వదిలేయాలి. రెండో జాబ్ వేరేచోట చేయాలి. ఎందుకంటే ఒకచోట నెలరోజులపాటు ఉద్యోగం చేస్తే అందులో నేర్చుకోడానికి ఏమీ ఉండదు. పైగా కష్టమంటే ఏంటో తెలియదు. అందుకే దాన్ని వదిలేసి వేరే ప్రయత్నం మొదలుపెట్టాడు.

ఈసారి అమీర్‌ పేటలో. అక్కడ హేమంత్ అని ఓ హైదరాబాదీ పరిచయం అయ్యాడు. కొద్దిసేపు మాట్లాడగానే ఫ్రెండయ్యాడు. మాటల్లోనే ఇద్దరూ పావ్ భాజీ తిన్నారు. ఈ కాస్త సమయంలోనే భోజనం పెట్టించాడేంటి అని హితార్ధ్ ఆశ్చర్యపోయాడు. అతనికి తెలిసిన ఫ్రెండుకి బన్సీలాల్ పేటలో వైట్ బోర్డు తయారుచేసే కంపెనీ ఉంది. అక్కడికి పంపాడు. అక్కడ మార్కెటింగ్ జాబ్. అక్కడా ఐదు రోజులు. తర్వాత డెలివరీ బోయ్ అవతారం. ఒకసారి ట్రాఫిక్ పోలీస్ అడిగాడు.. ఒక్కడివే ఇంత సామాను ఎలా మోసుకుపోతావు అని. తప్పదు కదా సర్ పొట్టకూటి కోసం అన్నాను అని చెప్పుకొచ్చాడు.

అయితే ఒక్కటే సమస్య. ఎక్కడ ఉద్యోగం చేసినా నెలాఖరునే జీతం ఇస్తారు. మరి హితార్ధ్ నెల రోజులు ఒకేచోట జాబ్ చేయొద్దని షరతు. మరి పూట ఎలా గడవాలి అన్నది పెద్ద సమస్య. అందుకే ఫలానా సమస్య వల్ల ఉద్యోగం వదిలేస్తున్నా అని అబద్ధం చెప్పి, వారం రోజుల జీతం తీసుకుని వేరేచోట ప్రయత్నం. ఈ ప్రయాణంలో ఒక రిక్షావాలా కలిశాడు. కొన్ని రోజులు అతడితో కలిసి ప్రయాణం. ఒక సాధువుతో కొన్ని దినాలు.. రోడ్డు పక్క బండి మీదనే టిఫిన్. ఫుట్ పాత్ మీద మీల్స్ పాయింట్ లోనే భోజనం.

image


మూడో వారం అడిడాస్ లో ఉద్యోగం. అదే రోజు ఇనార్బిట్ మాల్‌ లోని చిల్లీస్ రెస్టారెంట్‌ లోనూ జాబ్ వచ్చింది. జేడ్ బ్లూ వాళ్లు కూడా నౌకరీ ఇస్తామన్నారు. ఇంకోచోట కూడా ప్లేస్‌మెంట్ కన్ఫమ్ అయింది. అలా ఒకే రోజులో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. అందులో మొదట అడిడాస్ ఎంచుకున్నాడు. బాగా చేస్తే నెలకు 28వేలు ఇస్తామన్నారు అక్కడ వారం చేశాడు. నాలుగో వారం జేడ్ బ్లూలో పనిచేశాడు.

అచితే ఎక్కడ పనిచేసినా వర్క్ ప్లేసులో పాలిటిక్స్ లేవు అంటాడు హితార్ధ్. సాధారణంగా ఏ ఆఫీసులో అయినా కొత్తవాళ్లను తొక్కేయాలి అని చూస్తారు. కానీ అదృష్టం కొద్దీ తనకలా జరగలేదు అంటాడు. నేనెవరో వాళ్లకు తెలియదు. వాళ్లెవరో నాకు తెలియదు.. అయినా నాకెందుకు వాళ్లు సహాయం చేయాలి? నా మీద ఇంత జాలి ఎందుకు చూపించాలి? ఇందులో ఏదో తెలియని కనెక్షన్ ఉంది. మంచీ, మానవత్వం ఇంకా లోకంలో ఉన్నాయి కాబట్టే ఊరుకాని ఊరిలో బతికాను అంటాడు. ప్రత్యేకంగా హైదరాబాదీల మనసు బంగారం అని కితాబిచ్చాడు. ఏ సంబంధమూ లేని నన్ను భాగ్యనగరం అక్కున చేర్చుకుందని సంతోషంతో చెప్పాడు. ఉద్యోగం కావాలని, కష్టాల్లో ఉన్నానని ఒక కట్టుకథ చెప్తే వెనకాముందూ ఆలోచించకుండా అనేక మంది స్పందించిన తీరు నచ్చిందన్నాడు. ఇప్పటివరకు వరి అన్నం ఎలా వుంటుందో అతడికి తెలియదు. హైదరాబాద్ పుణ్యమాని అది తినడం నేర్చుకున్నాను అంటాడు.

నిజానికి సాధారణ తరగతి యువకుడిలా కనిపించలేక పోయాను అని హితార్ధ్ ఒప్పుకున్నాడు. తెల్లగా క్యూట్‌ గా ఉండటం వల్ల గరీబుల పిల్లాడినంటే ఎవరూ నమ్మలేదని నవ్వుతూ చెప్పాడు. ఆ విషయంలో మాత్రం ఓడిపోయాను అంటాడు. మనల్ని నమ్ముకుని బతికేవారికి మనం ఏం చేస్తే సంతోషిస్తారో అది నేను నేర్చుకున్నాను అంటాడు హితార్ద్.

మొత్తం మీద నెలరోజుల పరీక్ష పూర్తయింది.. తాను ఎక్కడ ఉన్నాడో ఇంట్లోవాళ్లకు చెప్పగానే వాళ్లు ఆగమేఘాల మీద హైదరాబాద్ వచ్చారు. ఈ విషయం తెలిసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ త్రివేది మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతడి వివరాలు వెల్లడించారు.