సామాజిక సేవకు సింబల్ ... 'బిజ్లీ మల్లిక్‌'

బడి పిల్లలకు విద్య, పోషకాహారం పసి పిల్లలకు ఆహారం, ఆరోగ్యంపేద మహిళలకు చేయూత, యువతకు వొకేషనల్ కోర్సులువృద్ధులకు ఆరోగ్య సేవలు, చదువు చెప్పే కార్యక్రమాలువీధి బాలలకు బాసట, బాలికలకు ప్రత్యేక సంరక్షణఇంకా ఎన్నో.. ఎన్నెన్నో...అన్నీ చేస్తున్న వ్యక్తి ఒక్కరే అంటే నమ్మగలరా ?

సామాజిక సేవకు సింబల్ ... 'బిజ్లీ మల్లిక్‌'

Tuesday September 01, 2015,

4 min Read

బిజలీ మల్లిక్

బిజలీ మల్లిక్


ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ డాక్టర్ బిజ్లీ మల్లిక్. చిన్నారులకు చదువు అందించేందుకు పాటుపడుతున్న ఈ స్వచ్ఛంద సంస్థను ఐపీఈఆర్‌గా కూడా వ్యవహరిస్తారు. దక్షిణ కొల్కతాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తోంది ఈ సంస్థ. వీటిలో మొత్తం 1445మంది విద్యార్ధులుండగా.. 682మంది బాలలు, 763మంది బాలికలున్నారు.

“మొత్తం 30సెంటర్లుండగా... 39మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. చిన్నారుల సమగ్రాభివృద్ధికి.. ఐపీఈఆర్ పలు కార్యక్రమాలు చేపడుతుంది. పేదరికంలో మగ్గిపోతూ చదువుకు దూరమైపోయిన వీధిబాలలను, సమాజంలోకి తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది ఈ సంస్థ. విద్య, పోషకాహారం, పారిశుధ్యం, పరిశుభ్రత, శుభ్రమైన తాగునీరు, వినోదభరిత కార్యక్రమాలను.. చిన్నారుల కోసం నిర్వహిస్తోంది ఐపీఈఆర్. గత ఏడాది కాలంలో 16సెంటర్ల ద్వారా కోల్కతాలోని 500మంది పిల్లలకు సౌకర్యాలు కల్పించగలిగారు. వీటితోపాటు తగిన చదువుపై సూచనలు పొందలేని వారికి సాయం చేయడం, పోషకాహార అవసరాలతోపాటు... బాలల హక్కుల కమిషన్, అంతర్జాతీయ కార్మిక సంఘం లక్ష్యాలకు అనుగుణంగా బాల కార్మిక నిర్మూలనకు పాటు పడుతోంది ఐపీఈఆర్. ఇప్పటికి 350మంది చిన్నారులను ఈ ప్రాజెక్టులో భాగం చేయగలిగామ”ని తెలిపారు బిజలీ మల్లిక్.


ఈమె గురించి తెలుసుకోవాలంటే రెజ్యూమె చూడాల్సిందే. కనీస వసతులు లోపించిన మహిళలు, చిన్నారుల అభ్యున్నతి కోసం ప్రొఫెషనల్ విమెన్ పాటుపడుతున్న సొరాప్టిమిస్ట్ ఇంటర్నేషనల్ ఆఫ్ సౌత్ కోల్కతాకు ఈమె అధ్యక్షురాలు. 1991నుంచి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూజ్‌ మెంబర్. సిగరెట్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2009, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధించే చట్టం 2008లను అమలు పరిచేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో సభ్యురాలు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక(12012-17)ను రూపొందించేందుకు... పాఠశాల విద్యాశాఖ, అక్షరాస్యతా విభాగానికి అనుబంధంగా పనిచేసిన వర్కింగ్ గ్రూప్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్‌లో కూడా బిజలీ సభ్యురాలుగా 2011లో ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రప్రభుత్వం దక్షిణ 24పరగణాలకు ఏర్పాటు చేసిన బాలల సంక్షేమ సమితికి 2011 నవంబర్ 1 నుంచి ఈమె ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

image


ఐపీఈఆర్ చేపట్టే ప్రధాన కార్యకలాపాలు

• సమాజంలో బాలలు, మహిళల హక్కులపై అవగాహన కల్పించడం

• బాలల రక్షణ కోసం వారిని గ్రూపులుగా ఏర్పాటు చేయడం

• హై రిస్క్ కేటగిరిలో ఉన్న పిల్లలకు సాధారణ పద్ధతులకు మించి విద్యను అందించే ప్రయత్నం చేయడం

• పెద్దలు ముఖ్యంగా మహిళల్లో అక్షరాస్యతను పెంపొందిచడం

• తాము ఏర్పాటు చేసిన సెంటర్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు తగిన పోషకాలు ఉండే ఆహారాన్ని అందించడం

• హాస్పిటల్స్, మొబైల్ క్లినిక్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన

• సమాజ, సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం

• స్కూల్స్‌కు వెళ్లేలా చిన్నారులను ప్రోత్సహించడం, వారికి తగిన మద్దతు అందించి... పాఠశాల మానేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం

• విద్యార్ధులు చదువు కొనసాగించి, ఉత్తీర్ణులయ్యేలా నాణ్యమైన విద్యను అందించేందుకు గాను టీచర్లకు శిక్షణ ఇవ్వడం

• చికిత్స అవసరమైన పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకునే వ్యక్తిగతంగాను, గ్రూపులుగానూ శిక్షణ ఇవ్వడం

• విద్య, ఆహారం, ఆరోగ్యం కోసం చిన్నారులకు స్పాన్సర్ చేయడం

• యువ మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రయత్నించి, వారి ఆదాయం పెరిగేందుకు సహకరించడం

• పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించడం

• పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌కోసం ప్రాథమిక పాఠశాలల టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం

• సోషల్ వర్క్ అండ్ మేనేజ్‌మెంట్‌పై కళ్యాణి యూనివర్సిటీ గుర్తింపు పొందిన డిప్లొమా కోర్స్ నిర్వహించడం

• కౌన్సిలింగ్, స్వయం అవగాహనా కార్యక్రమాల ద్వారా మద్యపానాన్ని మానిపించేందుకు కూడా ఐపీఈఆర్ ప్రయత్నిస్తోంది.

లబ్ధిపొందిన వారి మాటలు

“ఇద్దరు కూతుళ్లను నేనే పోషించుకోవాలి. వీరికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం నాకు చాలా కష్టమయ్యేది. నా చిన్న కూతురు బాధ్యతను తీసుకుని.. ఐపీఈఆర్ నా సమస్యకు పరిష్కారం చూపింది. ఇప్పుడు నా కూతురికి ఆహారం, వసతి, చదువు అన్నిటినీ వారే దగ్గరుండి చూసుకుంటున్నారు” అని దక్షిణ కొల్కతాలోఇళ్లలో పనిమనిషిగా చేసే మిథు మొన్‌డాల్ అంటోంది.

“నా భర్త మద్యానికి బానిసగా మారిపోయాడు. కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. తను ఇచ్చే డబ్బులు నా పిల్లలిద్దరికీ తిండి పెట్టడానికి కూడా సరిపోయేవి కావు. అలాంటి సమయంలో ఇరుగుపొరుగు ద్వారా ఐపీఈఆర్ గురించి తెలుసుకుని... నా కూతురుని అక్కడ చేర్చాను. ఇప్పుడు నేను ఒక పిల్లాడికి సంబంధించిన బాధ్యతలు చూసుకుంటే సరిపోతోంద”ని గృహావసరాలు చూసే మరో పనిమనిషి సుభద్ర చెబుతోంది.

“ చదువు లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని నేను నమ్ముతాను. దిగువ తరగతి వారు కూడా విద్య నేర్చకోగలిగితేనే... సమాజం అభివృద్ధి సాధిస్తుంది. అక్షరాస్యత సాధించాలనే లక్ష్యాలకు, వాస్తవ ప్రగతికి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఐపీఈఆర్. ఇలా సామాజికంగా వెనుకబడ్డ పిల్లలు.. దేశం ఇచ్చిన, సమాజం అందించిన హక్కులను కోల్పోవడం సరికాదు. అందుకే ఈ తరహా కమ్యూనిటీలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. 2 నుంచి 6 ఏళ్లలోపు వయసు గల పసివారి కోసం.. బాల్యం, బాలల అభివృద్ధిపై టీచర్లు, పేరెంట్స్‌కు ఆరు నెలల కోర్స్ కూడా ప్రారంభించాం. పిల్లల మనస్తత్వాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. చిన్నారుల ప్రవర్తనను మరింతగా అర్ధం చేసుకునేందుకు.. వారు రేపటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా చేసేందుకు ఉపయోగపడుతుంది” అంటున్నారు మల్లిక్.

తగినంత ఆదాయం ఆర్జించలేకపోతున్న దక్షిణ కొల్కతా యువత కోసం పలు రకాలైన కోర్సులను నేర్పే ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తోంది ఐపీఈఆర్. వీధులపై నివాసమున్న 28మంది హైరిస్క్ బాలికలకు వసతి కల్పిస్తున్నారు కూడా. కంప్యూటర్ ఆన్ వీల్స్ పేరుతో ఓ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. గతేడాది జనవరిలో మొదలైన ఈ ప్రోగ్రాం ద్వారా... ఆయా కాలనీలకు వెళ్లి, అక్కడి యువతకు యానిమేషన్ వంటి వొకేషనల్ కోర్సులు నేర్పుతున్నారు. దీని ద్వారా వారి ఆదాయం గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు కూడా. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లలో చేరి కోర్సులు నేర్చుకునే స్థోమత లేని ఎంతో మంది పేద యువతకు ఈ కార్యక్రమం పెన్నిధిలా కనపడుతోంది. అయితే కొన్ని పన్ను సంబంధిత నిబంధనల కారణంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినా... తిరిగి ప్రారంభించబోతోంది ఐపీఈఆర్. స్కూల్ ఆన్ వీల్స్ పేరుతో... ఆయా కాలనీలకే వెళ్లి చదువు చెప్పే ప్రణాళికను త్వరలో అమలు చేయబోతోందీ సంస్థ.

“ మా దగ్గర తైక్వాండో నేర్చుకున్న ఐదుగురు బాలికలు బెంగళూరు, నేపాల్లో జరిగిన నేషనల్ స్థాయి పోటీల్లో అవార్డు సాధించారు. బాలికల ఆత్మ స్థైర్యం, స్వీయ రక్షణ కోసం తైక్వాండో కూడా నేర్పుతున్నాం” అని గర్వంగా చెప్పారు బిజలీ మల్లిక్.