ఒకప్పటి చిన్న ఐటి ట్రైనింగ్ సెంటర్‌.. ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్ కంపెనీ

ఒకప్పటి చిన్న ఐటి ట్రైనింగ్ సెంటర్‌.. ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్ కంపెనీ

Saturday October 10, 2015,

3 min Read

పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు విజయం సాధించిన వాడికంటే... సంక్షోభం దెబ్బకొట్టినప్పుడు ఫీనిక్స్ పక్షిలా పైకెగసి గర్వంగా తలెత్తిన వాడే అంతకన్నా గొప్పవాడు. అలాంటి వారిలో రోహిత్ అగర్వాల్ ఒకరు. అది 1993. భారతదేశంలో అప్పుడే ఐటీ రంగం విస్తరిస్తోంది. ఇన్ఫోసిస్ ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా అప్పుడే. ఐటీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎదురుచూస్తున్న వారిలో రోహిత్ కూడా ఒకరు. కానీ సరిగ్గా అదే సమయంలో డాట్ కామ్ సంక్షోభం ఐటీ రంగాన్ని కుదిపేసింది. ఆ సంక్షోభం నుంచి అవకాశాల్ని వెతుక్కొని విజయం సాధించిన వ్యక్తి రోహిత్. 

ఆ సంక్షోభం సమయంలో ప్రారంభించిన ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు రెండు వందల కోట్ల టర్నోవర్ సాధించిందంటే అంతకు మించిన విజయం ఏముంటుంది. రోహిత్‌కు గణితం, కంప్యూటర్స్ ఇష్టమైన సబ్జెక్ట్స్. చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాలేజీలో ఉన్నప్పుడే చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం మినీ ఎంటర్‌ప్రైజ్, రిసోర్స్ ప్లానింగ్‌ను రూపొందించారు. సొంత ఐటీ ఎక్స్‌పోర్ట్ కంపెనీ ప్రారంభించడానికి ముందే రోహిత్ తన తండ్రి కంపెనీలో పనిచేశారు.

" సొంతగా ఐటీ ఎక్స్‌పోర్ట్ కంపెనీ ప్రారంభించాలనుకున్నా. కానీ ఎక్కడ, ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు. ముందుగా ఐటీ ట్రైనింగ్ కంపెనీ ప్రారంభించడం మంచిదని కొందరు నాకు సలహా ఇచ్చారు. అప్పటికే డిజిటల్ ఎక్వి‌ప్‌మెంట్ కార్పొరేషన్ ఫ్రాంచైజ్ కోసం చూస్తోంది. నేను చండీగఢ్ కోసం అప్లై చేశాను. కానీ వాళ్లు నాకు ఢిల్లీ ఇచ్చారు. అలా కోనిగ్ శిక్షణా సంస్థ ఢిల్లీలో ప్రారంభమైంది" అంటూ గతాన్ని వివరిస్తారు రోహిత్.

డాట్ కామ్ క్రాష్...

మొదట్లో కోనిగ్ కూడా దేశీయ మార్కెట్‌కు సేవలందించే మిగతా ఐటీ ట్రైనింగ్ సెంటర్ లాంటిది. అయితే డాట్ కామ్ సంక్షోభం తర్వాత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్రమైన పోటీ ఉన్న మార్కెట్లో కంపెనీ మనుగడ కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. అయితే వాటిని అధిగమించడంలో రోహిత్ సక్సెస్ అయ్యారు. ప్రతీ ట్రైనింగ్ బ్యాచ్‌లో ఒకరిద్దరు విద్యార్థులు యూరప్ నుంచి ఉన్నారని గుర్తించారు. ఇకపై అలాంటి విద్యార్థుల కోసం ట్రైనింగ్ ప్యాకేజీలోనే వసతి, విమాన ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించారు. కోనిగ్ సంస్థకు, విదేశీ విద్యార్థులకు మధ్య విన్ విన్ ఫార్ములాను రూపొందించారు. ఈ ఐడియా బాగా క్లిక్ అయింది. పర్యాటక ప్రాంతాలైన షిమ్లా, డెహ్రడూన్, గోవా ప్రాంతాల్లో కోనిగ్ ట్రైనింగ్ సెంటర్లు ప్రారంభించి ఎడ్యుకేషన్ టూరిజం వైపు అడుగులు వేశారు. " ఇప్పటికీ ఎడ్యుకేషన్ టూరిజం రంగంలో మేమే మార్గదర్శకులం అన్నది మా నమ్మకం " అంటారు కోనిగ్ ఫౌండర్, సీఈఓ రోహిత్ అగర్వాల్. 

కోనిగ్‌కు ప్రపంచంలోని 50 దేశాల నుంచి కస్టమర్లున్నారు. ఈ బిజినెస్ మోడల్‌లో ఎన్నో మార్పుచేర్పులు చేశారు. తక్కువ ఖర్చులో సర్టిఫైడ్ ట్రైనర్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ట్రైనింగ్ ఇస్తున్నారు.

"యూఎస్ఏ, యూకే, ఇతర యురోపియన్ దేశాల్లో ట్రైనింగ్ చాలా ఖరీదైనది. అందుకే విద్యార్థులు ఐటీ ట్రైనింగ్ కోసం ఇండియా ఎంచుకుంటారు. యూఎస్, యూరప్, ఆస్ట్రేలియా విద్యార్థులు ఐటీ ట్రైనింగ్ కోసం ఇండియావైపు చూడటానికి తక్కువ ఖర్చు, టూరిజమే కారణాలు. ఇక ఆఫ్రికన్, ఆసియా విద్యార్థులు క్వాలిటీ, హై స్కిల్డ్ ట్రైనర్లు ఉన్న కారణంగా ఇండియాకు వస్తున్నారు. ఇండియన్ వీసాలో తలెత్తుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని దుబాయిలో అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్‌ని ప్రారంభించాం" అని వివరిస్తారు రోహిత్.

image


సవాళ్లపై యుద్ధం

మైక్రోసాఫ్ట్, సిస్కో, ఒరాకిల్, వీఎం వేర్, రెడ్ హ్యాట్, శాప్, నోవెల్, ఈసీ కౌన్సిల్, అడోబ్, యాపిల్, ఆటోడెస్క్, చెక్ పాయింట్, ప్రిన్స్2, పీఎంఐ, సేల్స్ ఫోర్స్, జెండ్, ఈఎంసీ, సిట్రిక్స్, ఆండ్రాయిడ్, సిమాంటిక్, ఐఐబీఏ, ఎస్ఏఎస్, లైనక్స్ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్ లాంటి ప్రముఖ సంస్థలకు కోనిగ్ గుర్తింపు పొందిన శిక్షణా భాగస్వామి. అంతేకాదు... ప్రోమెట్రిక్, వ్యూ, నోవెల్ సంస్థలకు ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్ కూడా. తమ సంస్థ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కస్టమర్లను ఒప్పించడం వీరికి ప్రధానమైన సవాల్. నాణ్యమైన ఐటీ విద్యను అందిస్తే రాబడుల్లో ఢోకా ఉండదని నిరూపించింది ఈ సంస్థ. అయితే ఈ రంగంలో ఇప్పటికీ దక్కాల్సిన ప్రాధాన్యం దక్కట్లేదన్నది వీరి అభిప్రాయం. ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకునేందుకు కస్టమర్ల ఫీడ్ బ్యాక్, మార్కెట్లో మార్పులపై ఈ టీమ్ చురుగ్గా అధ్యయనం చేస్తోంది. సరికొత్త డెలివరీ పద్ధతుల్ని, వ్యాల్యూ యాడెడ్ సర్వీసుల్ని ప్రారంభించి... కోనిగ్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందిస్తోంది. కోనిగ్‌లో కస్టమైజ్డ్ ట్రైనింగ్ సెంటర్... ప్రతీ కస్టమర్ అవసరాలను తీర్చుతుంది.

భవిష్యత్తు ప్రణాళికలు

ప్రస్తుతం కోనిగ్ టర్నోవర్ రూ.200 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో 40 శాతం వృద్ధి సాధించారు. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సెంటర్స్ పెరుగుతున్నందున కోనిగ్ కూడా ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సులు అందిస్తోంది. 2017 నాటికి విద్యారంగం 50 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంటుందన్నది ఓ పరిశోధన సారాంశం. జెర్మనీతో భారతదేశం ద్వైపాక్షిక భాగస్వామ్యంతో వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ పెరుగుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ వివరిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ విలువ 118 బిలియన్ యూఎస్ డాలర్లు. గతేడాది కొత్తగా లక్షా 80 వేల మంది వచ్చి చేరారు. ప్రతీ ఖండంలో ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాలన్నది కోనిగ్ ఆలోచన. 2020 నాటికి ప్రపంచంలోని అత్యున్నత ఐటీ ట్రైనింగ్ కంపెనీల్లో ఒకటి కావాలన్నది వీరి లక్ష్యం.