శంకర్ ఐ మూవీ తెలుసుగా ? అందులో ఆరెంజ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఒక పాట మొదలవుతుంది ఐలా ఐలా ఐ అంటూ.. ఫాస్ట్ పేస్డ్ ట్రాక్ లో సాగే ఆ హస్కీ స్వరం వింటుంటే.. వేడి వేడి టీలో డార్క్ ఫాంటసీ చాకో బిస్కెట్ ముంచుకుని తిన్నట్లుగా అనిపిస్తుంది. పొగలుగక్కే చాయ్ లో చాకొలేట్ ఫ్లేవర్ బిస్కెట్ ఎంత వెరైటీ కాంబినేషనో.. ఆ పాట వింటున్నంత సేపు అదో టైపు డిఫరెంట్ ఫీలింగ్ వెంటాడుతుంది. హస్కీ విత్ వెస్టర్న్ కలగలిసిన ఆ మెస్మరైజింగ్ స్వరం మరెవరిదో కాదు భారతీయ సంగీత యువ కెరటం నటాలి-డి-లుచియోది.
నటాలి డి లుచియో. పుట్టింది కెనాలో అయినా.. పెరిగిందంతా ఇటలీలో. టాలెంట్ కనబర్చింది మాత్రం ఇండియాలో. భారత్ లాంటి వైవిధ్యభరితమైన దేశంలో అనేక ప్రాంతాల కళాకారులు ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. హిందుస్తానీ, కర్ణాటక ఇతర ప్రాంతీయ జావళీలతో పరిమళించే భారతీయ సంగీతంలో నటాలి తనదైన స్థానాన్ని దక్కించుకుంది.
బాలీవుడ్లో నటాలి పాడిన పాటలు చార్ట్ బస్టర్స్ లిస్ట్లో టాప్ లిస్ట్లో నిలబెట్టాయి. 2012 ఏప్రిల్ 27న నటాలి ముంబయిలోని ఎన్సీపీఏ లో అకాడమీ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరక్టర్ ఏఆర్ రెహమాన్తో కలిసి స్టేజ్ షేర్ చేసుకుంది. రెహమాన్ ను చూడగానే నటాలి భయంతో ఒకరకమైన నర్వెస్ కు గురైంది. గొంతు పెకలడం లేదు. పాట బయటకు రావడం లేదు. అంతటి భావోద్వేగానికి గురైన నటాలి.. అసలు రెహమాన్ లాంటి స్వరకర్తతో కలిసి పాడటాన్ని తన జీవితంలో సాధించిన గొప్ప విజయంగా భావిస్తోంది.
నటాలి నాలుగేళ్ల వయస్సులోనే పాటలతో అదరగొట్టంది. టాలెంట్ ను గుర్తించిన ఆమె తల్లి మ్యూజిక్ క్లాసులకు పంపించింది. పదేళ్ల వయస్సు వచ్చేప్పటికి నటాలి ఒక ప్రొఫెషనల్ సింగర్ గా మారాలని డిసైడయ్యింది. వెస్టర్న్, క్లాసికల్ మ్యూజిక్ తోపాటు ఒపెరా ప్రదర్శనల కోసమూ ట్రైనింగ్ తీసుకుంది. ఇటాలియన్, ఫ్రెంచ్, జర్మన్ బాణీలతో నటాలి తనకంటూ ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకుంది.
భారత్ వైపు అడుగులు వేసిన నటాలి..
సరిగ్గా 18 ఏళ్ల వయస్సులో నటాలి ఇండియాలో అడుగుపెట్టింది. ఓ ప్రోగ్రాం కోసమని తొలి అడుగు ముంబయిలో వేసింది. ప్రోగ్రాం తర్వాత కెనడా వెళ్లిపోయింది. కానీ మనస్సంతా ముంబయిలోనే తిరగాడుతోంది. కుదుట పడాలంటే ఏదో ఒకటి చేయాలి. వెంటనే ఐడియా తట్టింది. యూట్యూబ్ లో తూజానేనా అనే ఓ మ్యూజిక్ వీడియోను అప్ లోడ్ చేసింది. అంతే.. అది కాస్తా.. వైరల్ గా పాకిపోయింది. అప్ లోడ్ చేసిన కొన్ని రోజులకే మిలియన్ హిట్స్. బోలెడంత క్రేజ్.
ఆ కిక్కుతో నటాలి వేరే థాట్ లేకుండా ఇండియా ఫ్లయిట్ ఎక్కి ముంబైలో వాలింది. దీపికా డిలిసియో దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ముంబైలోని స్థానిక మ్యూజిషియన్లు, మ్యూజిక్ డైరక్టర్ల దగ్గర శిశ్యరికం చేసింది. వారి నుంచి భారతీయ సంగీత కళామతల్లి ఆత్మను ఒడిసి పట్టింది. వెంటనే ముంబైలో ఏకంగా ఓ మరాఠి షోలో ఫెర్ఫామెన్స్ చేసింది.
ఇంగ్లిష్ వింగ్లీష్ సినిమాలో నటాలి నవ్ రాజీ మజ్జి అనే చిన్న పాట ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అంతలోనే విధి వెక్కిరించింది. గొంతులో ఏదో ఇన్ఫెక్షన్. వాయిస్ పోయింది. గాత్రధర్మం మారింది. చాలా ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో అవకాశాలు కోల్పోయింది. 23 ఏళ్లకే నటాలి తన కెరీర్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంది. ఒక రకంగా అగ్ని పరీక్షలా అయింది. చేసేదేం లేక తిరిగి కెనడాకు వెళ్లిపోయింది. అక్కడ స్పీచ్థెరఫీ, ఇతర చికిత్సా మార్గాలతో పొయిన స్వరాన్ని తిరిగి దక్కించుకుంది. కెనడాలోనే నటాలి స్టేజ్ పెర్ఫామెన్స్లు ఇచ్చి తన కెరీర్ను రీస్టార్ట్ చేసింది.
స్టార్ గా పయనం..
ఇక టార్గెట్.. భారత్లో సింగర్ కావాలి. మళ్లీ బ్యాగ్ సర్దుకుని విమానం ఎక్కేసింది. ఈసారి ముంబై కాదు.. చెన్నై. అక్కడ అడుగు పెట్టిన నటాలి జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, విశాల్ శేఖర్, సోను నిగమ్, అమిత్ త్రివేది లాంటి వాళ్లనుంచి ఆఫర్ వచ్చింది.
కేవలం బాలీవుడ్కే పరిమితం కాకుండా తెలుగు, తమిళ్, గుజరాతి, మరాఠి పాటలను కూడా పాడి మెప్పించింది. ఏఆర్ లాంటి వ్యక్తితో కలిసి పని చేయడం నిజంగానే అదృష్టమని నటాలి ఎన్నో వేదికలమీద చెప్పింది. అంతేకాదు ఏఆర్ తో కలిసి పనిచేయడం ఒక వండర్ అంటోంది.
ఎన్నెన్నో స్వరాలు పలికించే నటాలికి.. స్టేజ్ ఎక్కాలంటే మాత్రం ఇప్పటికీ భయమే. స్టేజ్ మీద జనాల్ని చూస్తూ మాట్లాడాలంటే చచ్చేంత వణుకు అంటోంది. అందుకే టెక్ ఎక్స్ ను తన వేదికగా మలుచుకుంది. మాట్లాడటం అంటే పాటలు పాడినంత ఈజీ కాదని అప్పుడే నటాలికి అర్థం అయ్యింది. అయితే తన నెర్వస్ నుంచి బయటకు వచ్చి టెక్ ఎక్స్ వేదికపై తన మనస్సులోని మాటల్ని బయటపెట్టింది. భయాన్ని జయించింది. ప్రజల మనసులను అంచనా వేసింది. ఇంకేముంది ఒక శక్తివంతమైన ప్రసంగం కళ్లముందు సాక్షాత్కారమైంది. యూట్యూబ్లో బాలీవుడ్ స్వరాలను కేవలం ఒక హాబీలా పాడిన నటాలి.. తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. ఇంటర్నెట్ ను ఉపయోగించి ఒక మ్యూజిక్ స్టార్లా నిలిచింది. మరి నటాలిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఒక స్టార్గా నిలవండి.