అందరూ సామాన్యులే.. ఎర్రబుగ్గ ఎవరికీ లేదు

అందరూ సామాన్యులే.. ఎర్రబుగ్గ ఎవరికీ లేదు

Thursday April 20, 2017,

2 min Read

వీవీఐపీ కల్చర్ కు పుల్ స్టాప్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న నేతలు ఎరుపు, నీలం బుగ్గలకు కార్లపై వాడకుండా నిబంధనలు విధించింది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలు, పోలీసులు మాత్రమే నీలం బుగ్గలను వాడేలా మార్పులు చేసింది. మే 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఈమేరకు కేంద్ర కేబినెట్ లో ప్రధాని చేసిన ప్రతిపాదలకు ఆమోదం తెలిపారు.

image


ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభత్వం. వీవీఐపీలు, కేంద్ర మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన నేతలు, ఉన్నతాధికారులు ఎర్ర బుగ్గలను వినియోగించరాదని తెలిపింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి సహా లోక్‌ సభ స్పీకర్‌ సహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిబంధనల్లో మార్పులకు ఆమోదం తెలిపింది. దీంతో మే 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నానయి. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండబోదు. అత్యవసర సేవలైన పోలీస్, ఫైర్, ఆర్మీ, అంబులెన్స్ లు మాత్రం నీలం బల్బులను ఉపయోగిస్తాయి.

నీలం బుగ్గల వినియోగంపైనా రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపనుంది కేంద్రం. ఇందుకోసం మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. వాటిపై నోటిఫికేషన్ విడుదల చేసి, మే 1 నుంచి నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

కేంద్ర నిర్ణయంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మహేష్ శర్మలు వెంటనే తమ కారుకున్న బుగ్గను తొలగించారు. అంతేకాదు ఎంపీ గిరిరాజ్ సింగ్ కూడా ఎర్రబుగ్గను స్వయంగా తొలగించారు. ఎర్రబుగ్గ కారును ఉపయోగించకూడదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నిర్ణయించారు.

వీవీఐపీ కల్చర్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి అడుగు వేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, నేతలు ఎర్రబుగ్గ కారును వినియోగించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా మంత్రులు, ఉన్నతాధికారులు ఎర్రబుగ్గ కారును వినియోగించరాదని ఆదేశించారు. యూపీ సీఎం యోగీ కూడా ఎర్రబుగ్గ కార్లను వినియోగించడం స్వచ్ఛందంగా నిలిపివేయాలని కోరారు. ఈ విషయంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశంలో అందరూ సామాన్యులే.. వీఐపీలు ఎవరూ లేరని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.