పాసైంది పదే.. కానీ మైక్రోసాఫ్ట్‌లో చీఫ్ యాప్ ఆర్కిటెక్ట్‌ అయ్యాడు..! అదీ ఓ తెలుగోడి సత్తా

పాసైంది పదే.. కానీ మైక్రోసాఫ్ట్‌లో చీఫ్ యాప్ ఆర్కిటెక్ట్‌ అయ్యాడు..! అదీ ఓ తెలుగోడి సత్తా

Wednesday October 07, 2015,

5 min Read

చదువుకు.. జ్ఞానానికి సంబంధం లేదు. చదువు జ్ఞానం, సంస్కారం ఇవ్వొచ్చేమో కానీ.. కొంత మంది విభిన్నమైన వ్యక్తులకు అదే జీవితం కాకపోవచ్చు. ఏదో ఒకటి చేయాలనే పట్టుదల, ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే బలీయమైన కాంక్ష కొంత మందిని ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కూడా అలాంటివాడే. చదివింది కేవలం పదో తరగతి.. అవును మీరు వింటున్నది ముమ్మాటికీ నిజమే. కానీ.. అతడి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కొలిచేందుకు సాధనాలేవీ లేవు. తనకు ఇష్టమైన..రంగంలో అతడు ఆరితేరాడు. ఆ పట్టుదల ముందు చదువు కూడా చిన్నపోయింది. ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కూడా.. అతడి టాలెంట్‌ను చూసిందే కానీ.. కాగితాల్లో ఉండే మార్కులను చూసి బేరీజు వేయలేకపోయింది. పదో తరగతి క్వాలికేషన్‌ అనే ట్యాగ్ పక్కనపడేసి.. పీజీలు, పిహెచ్‌డీలు చేసిన వాళ్లను కాదని.. ఉద్యోగంలోకి ఆహ్వానించింది. చివరకు తమ సంస్థలో అత్యున్నతంగా భావించే యాప్ ఆర్కిటెక్ట్ టీంలో ఉన్నతాసనం వేసి కూర్చోబెట్టింది. ఆ వ్యక్తే కోటిరెడ్డి. క్రిష్ణాజిల్లా వాసి.


మైక్రో‌సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ ఓ తరానికి స్ఫూర్తి ప్రదంగా నిలిచింది ఆయన ఇన్నోవేషన్. అదే స్ఫూర్తితో తన జీవిత ప్రయాణం సాగిందంటున్నారు కోటిరెడ్డి. క్రిష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఓ మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగిన కోటి రెడ్డి చదువుకున్నది పదో తరగతి వరకే. అనంతరం కంప్యూటర్స్ నేర్చుకుని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో అత్యున్నత ఉద్యోగం సంపాదించారు. క్వాలిఫికేషన్, కమ్యునికేషన్ లాంటివి కోటి రెడ్డి కంప్యూటర్ నాలెడ్జ్‌కి ఏ మాత్రం అడ్డుకాలేదు. అతని అమెరికా ప్రయాణానికి కూడా బ్రేక్ వేయలేకపోయాయి.

అమ్మ చెప్పింది

నువ్వు జీవితంలో బాగా పైకొస్తావురా ! చిన్ననాటి నుంచి అమ్మ చెప్పే ఈ మాటను వింటూ పెరిగిన కోటిరెడ్డి నిజంగానే జీవితంలో పైకొచ్చిన రోజు కూడా అమ్మ మాటనే గుర్తు చేసుకున్నారట. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్లినా అమ్మ మాటను గుర్తు చేసుకొని, అమ్మను తలచుకుంటే సక్సస్ అవుతారట. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వారు కంప్యూటర్ నేర్చుకొని జీవితంలో సక్సస్ కావొచ్చు. కానీ మైక్రోసాఫ్ట్ మొబైల్ యాప్స్ డిజైనింగ్‌లో కీలక సభ్యుడిగా పనిచేసే అవకాశం రాకపోవచ్చు. నేను సాధించింది గొప్ప అని చెప్పడం లేదు కానీ ఇంగ్లీష్ పదాలు కూడా తెలియని మారు మూల పల్లె నుంచి వచ్చి మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ లీడ్‌గా ఎదగడం అంటే సాధారణ విషయం అయితే కాదంటారాయన.

image


“చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన మాటలే నన్ను ముందుకు నడిపాయి. ఏదైనా అనుకోని, ఊహించని ఘటన జరిగినప్పుడు నేను కుంగిపోను. అప్పుడు ధైర్యం ఇచ్చే మాటలను గుర్తు చేసుకుని... ఆత్మవిశ్వాసం నింపుకుంటాను ” - కోటిరెడ్డి

సాఫ్ట్‌వేర్ కెరీర్ ఎలా ప్రారంభమైంది

ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఓ పల్లెటూరులో పుట్టి పెరిగిన ఓ సాధారణ వ్యక్తి మైక్రోసాఫ్ట్ యాప్ డెవలప్‌మెంట్ కోర్ టీంలో పనిచేసే స్థాయికి ఎదిగారు. ఆ ఎదుగుదలలో ఎన్నో ఆటు పోట్లు. ప్రతీ మజిలీని ఓ పాఠంగా నేర్చుకొని ముందుకు సాగారు. సుదూర ప్రయాణం తిరిగి భారత్ చేరుకునేలా చేసింది. కోటిరెడ్డి టెన్త్ పాస్ అయిన తర్వాత పండక్కి బట్టలు కొనుక్కోడానికి ఇంట్లో ఇచ్చిన 1000 రూపాయిలతో పిజిడిసిఏ కోర్సులో చేరారు. అప్పట్లో వెయ్యి రూపాయిలు చెప్పాపెట్టకుండా ఖర్చు చేశాడని ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. కానీ తనకిష్టమైన కంప్యూటర్ విద్య నేర్చుకోవాలనే పట్టుదలతో ఎంతో కష్టం మీద ఆ కోర్సు పూర్తి చేశారు.

image


“ప్రతి రోజూ ఉదయం ఇనిస్టిట్యూట్ ఎనిమిది గంటలకు తెరిచే వారు. నేను ఏడు గంటలకే అక్కడకు చేరుకునే వాడిని.” కోటిరెడ్డి

మూడు నెలల కోర్సు పూర్తయిన తర్వాత గుడివాడలోని ఓ షావుకారి దగ్గర డేటా ఎంట్రీ ఉద్యోగంలో చేరారు. అప్పుడు కోటి రెడ్డి నెల జీతం 750రూపాయిలు. ఇదే కోటిరెడ్డి మొదటి సంపాదన.

“నా మొదటి ఉద్యోగం డేటా ఎంట్రీ ఆపరేటర్. మొదటి జీతం 750రూపాయిలు. నేను అమెరికాలో మిలియన్ డాలర్లు సంపాదించినప్పటికీ నా మొదటి సంపాదన చెప్పుకోడానికి నేను గర్వపడుతున్నా” కోటిరెడ్డి

అనంతరం తాను కంప్యూటర్ నేర్చుకున్న ఇనిస్టిట్యూట్ లీజుకు తీసుకొని దాన్ని నడిపారు. ఒక ఏడాది పూర్తయ్యాక ఆ వ్యాపారాన్ని వదిలేసి హైదరాబాద్ చేరుకున్నారు. సిటీలో అక్క ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. చివరకి ఓ ఇనిస్టిట్యూట్ లో C లాంగ్వేజ్ ఫ్యాకల్టీగా చేరారు. ఓ కంపెనీ నుంచి ఆఫర్ రావడంతో అక్కడ జీతం ఎక్కువ ఇస్తారంటే చేరిపోయారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

image


మైక్రోసాఫ్ట్‌లోకి ఎంట్రీ

“నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తానంటే బహుశా ఆ కంపెనీవారు కూడా ఊహించరేమో. అంత గమ్మత్తుగా నా ప్రవేశం జరిగింది. అసాధ్యం నాతోనే సుసాధ్యమైంది ” అంటూ చిరునవ్వులు చిందించారు కోటిరెడ్డి

2004 కోటిరెడ్డి జీవితంలో మరచిపోలేని ఏడాది. అప్పటికే యంగెస్ట్ జెసిపి ఆఫ్ ఇండియాతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఓ మల్టీనేషనల్ కంపెనీ నుంచి సీటీఓగా ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని ఇంటికొచ్చారు. అప్పుడే మైక్రోసాఫ్ట్ నుంచి కాల్ వచ్చింది. రేపు ఇంటర్వ్యూకు రమ్మని పిలుపు. అప్పటికే ఓ గొప్ప కంపెనీలో సీటీఓగా ఆఫర్ లెటర్ చేతిలో ఉంది. ఇంతలోనే మైక్రోసాఫ్ట్ ఆఫర్. తాను ఏదైతే కలగన్నారో అది నిజమైన రోజు వచ్చిందని భావించారు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం ఆరుగంటలకే మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు చేరుకున్నారు. ఎనిమిది గంటలకు గానీ లోపలికి రానివ్వలేదు. తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమైంది... దాదాపు 12 రౌండ్లు. అన్నింటినీ క్లియర్ చేసుకొని సక్సస్‌ఫుల్‌గా ముగించారు.

తర్వాత మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ నుంచి సర్టిఫికెట్లు కావాలని ఫోన్ వచ్చింది. కోటిరెడ్డి దగ్గర ఉంది ఒకే ఒక సర్టిఫికేట్ అది టెన్త్ మాత్రమే. దాన్నే పంపారు. వెంటనే మరో కాల్... డిగ్రీ సర్టిఫికెట్ అడిగారు. నా దగ్గర ఉన్నది ఒకటే సర్టిఫికేట్ అని కోటి రెడ్డి సమాధానం. ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి కోటి రెడ్డి మాత్రమే. దీంతో ఇండియ హెడ్ కోటి రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కోటిరెడ్డి కంప్యూటర్ అర్హత చూసి డిగ్రీ లేకపోయినా స్పెషల్ కేస్‌ కింద పరిగణించి ఉద్యోగంలో తీసుకున్నారు. వారి నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. మైక్రోసాఫ్ట్ యాప్ ఆర్కిటెక్ కోర్ టీంలో ప్రపంచం మొత్తం మీద ఉన్న నలుగు సభ్యుల్లో కోటి రెడ్డి ఒకరు.

“నేను సక్సస్ కావడం గొప్ప విషయం అని చెప్పను కానీ. ఓ మధ్యతరగతి రైతు కుంటుబం నుంచి మైక్రోసాఫ్ట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగంలో చేరే దాకా నా ప్రస్థానంలో ఎంతో మంది నాకు సాయపడ్డారు. అందరికీ రుణపడి ఉన్నా.” కోటిరెడ్డి

స్వదేశానికి తిరుగు ప్రయాణం

అమెరికాలో ఓ గొప్ప సంస్థలో ఉద్యోగం. భారీ వేతనం. ఓ సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంతకంటే ఏం కోరుకుంటాడు. కానీ కోటి రెడ్డి అలా ఆలోచించలేదు. స్వదేశానికి ఏదైనా చేద్దామని అనుకున్నారు. తన దేశంలో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ముందు ఇండియా చేరుకుంటే అక్కడ ఏం చేయాలో ఆలోచించొచ్చు అనుకున్నారు. లక్షల మందిని శాసించే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియా చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వదిలేయాలని అనుకున్నప్పటికీ , అమెరికా బాసుల ఒత్తిడితో ఇక్కడ ఉద్యోగం కొనసాగించారు. డెల్ ఇండియా నుంచి వచ్చిన ఆఫర్ వదులుకోలేక మైక్రోసాఫ్ట్‌లో రిజైన్ చేశారు. అమెరికాలో ఉండగానే తన చదువును కొనసాగించి డాక్టరేట్ పూర్తి చేశారు.

కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్

ఇండియాలో కంపెనీ పెట్టాలని అమెరికా వెళ్లిన రోజే అనుకున్నారు. అయితే అది 2014లో కార్యరూపం దాల్చింది. ఓ సుదూర ప్రయాణం తర్వాత భారత్‌లో కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ఆవిర్భవించింది. దీని కింద భారత్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పేరుతో మరో కంపెనీ పనిచేస్తుంది. దీనిలో ఇంటర్న్స్‌ పాటు ఆన్ రోల్‌లో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో భారత్ ఇన్నోవేషన్స్ సేవలందిస్తోంది. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ చేరుకున్న కోటిరెడ్డి ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకున్నారు.

image


సామాజిక సేవ

పుట్టి పెరిగిన దేశానికి ఏదో చేయాలనే ఆశయంతో భారత్ చేరుకున్న కోటిరెడ్డి క్రౌడ్ బ్లడ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. క్రౌడ్ బ్లడ్‌కి ప్రపంచ వ్యాప్తంగా వాలంటీర్స్ ఉన్నారు. కోటి రెడ్డి గ్రూప్ నుంచి 33శాతం ఫండ్స్ ఈ క్రౌడ్ బ్లడ్‌కు అందుతాయి. ఎలాంటి ఆదాయం ఆశించకుండా సామాజిక సేవలో భాగమైంది ఈ స్వచ్ఛంద సంస్థ. దీని నెట్వర్క్‌ను విస్తరించడమే ప్రస్తుతం కోటిరెడ్డి భవిష్యత్ ప్రణాళిక. క్రౌడ్ ఫ్లాట్ ఫాంలో ఇతర సేవలను తీసుకు రావాలని యోచిస్తున్నారు.

“నేను పుట్టిన దేశానికి సేవచేసే అవకాశం రావడాన్ని గర్వంగా భావిస్తున్న.” అని నవ్వుతూ ముగించారు కోటిరెడ్డి