హైదరాబాద్ స్టార్టప్ స్మార్ట్రాన్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఇన్వెస్టర్

కొత్త ఫోన్ల లాంఛ్, త్వరలో అద్భుతాలు చూస్తారన్న సచిన్

హైదరాబాద్ స్టార్టప్ స్మార్ట్రాన్‌లో మాస్టర్ బ్లాస్టర్ ఇన్వెస్టర్

Thursday May 19, 2016,

2 min Read


హైదరాబాద్‌ స్టార్టప్ స్మార్ట్రాన్‌.. కొత్త తరహా స్మార్ట్ మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. పరిచయం అవసరం లేని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే ఈ స్టార్టప్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్న సచిన్.. తానే స్వయంగా వచ్చి ఈ మొబైల్ లాంఛింగ్‌లో పాల్గొన్నాడు.

కొత్తగా లాంఛ్ చేసిన ఫోన్, ట్యాబ్లెట్ తో సచిన్, మహేష్ లింగారెడ్డి

కొత్తగా లాంఛ్ చేసిన ఫోన్, ట్యాబ్లెట్ తో సచిన్, మహేష్ లింగారెడ్డి


టిఫోన్ పేరుతో విడుదలైన ఈ మొబైల్ ధర రూ.22,999గా నిర్ణయించారు. 5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1.6 గిగాహెజ్ ప్రాసెసర్, 4 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్స్ బ్యాక్ కెమెరా వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. 4GB ర్యామ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ దీని సొంతం. 1080X1920 రెసొల్యూషన్‌తో ఉండే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న స్మార్ట్రాన్.. మొదట 10 వేల హ్యాండ్ సెట్స్‌ను తయారు చేయిస్తోంది. టెక్నాలజీ అంతా వీళ్లే డెవలప్ చేసి కేవలం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు మాత్రమే వాళ్లకు ఇస్తున్నారు. సమీప భవిష్యత్తులో సొంత ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకే సిద్ధంగా ఉన్నామని సంస్థ చెబ్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై 10 మిలియన్ డాలర్లును వెచ్చించినట్టు వెల్లడించిన స్మార్ట్రాన్.. విస్తరణకు అవసరమైన మరిన్ని నిధుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

'' ఇంజనీరింగ్, ఇన్నోవేటివ్ స్పిరిట్ కోసం స్మార్ట్రాన్ పనిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్రాండ్లతో పోటీపడే సత్తా భారత కంపెనీలకూ ఉందని రుజువు చేయడానికే కష్టపడ్తున్నాం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. స్మార్ట్ టెక్నాలజీ స్పేస్‌లో భారత్ ఉన్నత స్థానంలో నిలబడ్తుందని ఆశిస్తున్నా '' - సచిన్ టెండుల్కర్

వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్న సచిన్, ఈ సంస్థకు బ్రాండ్ ఎంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఈ ఏడాదిలో మార్చి నెల నుంచి సచిన్ బోర్డులోకి వచ్చినట్టు కంపెనీ గతంలో ప్రకటించింది. అయితే ఎంత ఇన్వెస్ట్ చేశారు అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు.

image


'' మొదట ఆన్‌లైన్ స్టోర్లలో మొబైల్ ఫోన్ల విక్రయం తర్వాత ఓవర్సీస్ మార్కెట్లపై దృష్టిసారిస్తాం. మిడిల్ ఈస్ట్, రష్యా వంటి దేశాలకు మా ప్రోడక్టులకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం '' - మహేష్ లింగారెడ్డి
image


ఆగస్టు 2014లో మొదలైన ఈ కంపెనీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ డివైజెస్‌పై పనిచేస్తూ వస్తోంది. ఈ సంస్థకు ఫౌండర్, ఛైర్మన్‌గా ఉన్న మహేష్ లింగారెడ్డి గతంలో యూఎస్‌కు చెందిన సెమీకండక్టర్ సంస్థ సాఫ్ట్ మెషీన్స్‌ పేరుతో కంపెనీని నెలకొల్పారు. మైక్రోప్రాసెసింగ్‌కు చెందిన సాఫ్ట్ మెషీన్స్‌ స్టార్టప్ కొన్నేళ్ల క్రితం 150 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను రాబట్టింది. వివిధ దేశాలకు చెందిన కొంత మంది ప్రముఖ ఇన్వెస్టర్లు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్టు మహేష్ లింగారెడ్డి చెబ్తున్నారు. యూఎస్, ఇండియా, రష్యాలో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంటెల్ వంటి సంస్థల్లో పనిచేసి టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం గడించిన మహేష్.. కొద్దికాలం క్రితం స్మార్ట్రాన్‌ను లాంఛ్ చేశారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్, సెన్సార్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, బిగ్ డేటా ఎనలిటిక్స్‌‌లో ఉన్న అవకాశాలను గుర్తించి మహేష్ ఈ రంగంలో అడుగుపెట్టారు. 

image


website