ఆహార ప్రియుల నోరూరిస్తున్న జహీర్ఖాన్స్..
ఫుడ్ లవర్స్ను బోల్డ్ చేస్తున్న మాజీ క్రికెటర్
జహీర్ ఖాన్. ఈ పేరు గురించి ఇండియాలో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన యార్కర్లతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన జహీర్.. ఇప్పుడు ఫుడ్ లవర్స్ను కూడా క్లీన్ బోల్డ్ చేస్తున్నాడు. రుచికరమైన ఆహారాన్ని, స్పోర్ట్స్తో మిక్స్ చేసి అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. పుణెలోని లుల్లానగర్లో జహీర్ ఖాన్కు చెందిన రెస్టారెంట్ కమ్ స్పోర్ట్స్ లాంజ్, బార్ కస్టమర్లను కట్టిపడేస్తోంది.
ప్రతి ఒక్కరు కోరుకునేది కడుపు నిండా భోజనం, కంటినిండా నిద్ర. ఎన్ని డబ్బులున్నా అందరూ కోరుకునేవి ఈ రెండే. ఇందులో ముఖ్యమైంది కడుపునిండా భోజనం. అయితే ఎన్ని ఫుడ్ యాప్స్ వచ్చినా.. ఫుడ్ టెక్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నా.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో రెస్టారెంట్కు వెళ్లి తింటేనే మజా ఉంటుంది. హాట్ హాట్గా వరల్డ్ కప్ నడిచింది. ఇది ముగిసినవెంటనే ఐపీఎల్ షురూ. మ్యాచులు జరుగుతున్న సమయంలో జహీర్ఖాన్ రెస్టారెంట్లో వేడివేడి ఫుడ్ ఐటెమ్స్ లాగిస్తే.. ఎలా వుంటుంది.
దశాబ్దాలపాటు క్రికెట్లో భారత్కు సేవలందించిన జహీర్ఖాన్.. రిటైర్ కాకముందే భవిష్యత్పై దృష్టి సారించాడు. ఏదైనా బిజినెస్ చెయ్యాలన్న ఆలోచన చేశాడు. చాలాకాలం తర్వాత ఫుడ్ బిజినెస్ అయితే బాగుంటుందని డిసైడ్ అయ్యాడు. ‘హాస్పిటాలిటీ’పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. రెస్టారెంట్తోపాటు స్పోర్ట్స్ లాంజ్ కూడా పెట్టాడు. జహీర్కు క్రికెట్ తర్వాత ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే 2005లోపూ జహీర్ఖాన్స్ హాస్పిటాలిటికి శ్రీకారం చుట్టాడు.

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్..
తొలి రెస్టారెంట్ను పుణెలోని లూల్లా నగర్లో ప్రారంభించారు. మొదట్లో రెస్టారెంట్ మాత్రమే ప్రారంభించారు. ఆ తర్వాత దానికి స్పోర్ట్స్ బార్, లాంజ్ కూడా యాడ్ చేశారు. పైగా ఒక ఫేమస్ క్రికెటర్ రెస్టారెంట్ అంటే.. స్పోర్ట్స్ లవర్స్కి పండగే. మ్యాచుల సందర్భంగా ఈ రెస్టారెంట్లో ఓ ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. కస్టమర్లంతా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రోజైతే చెప్పడానికి లేదు. అదో పండగే. ప్రేక్షకులంతా తింటూ, తాగుతూ ఎంజాయ్ చేస్తారు అని జహీర్ ఖాన్ వివరించారు.
నోరూరించే వంటకాలు..
హోటల్ బిజినెస్ అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా లైసెన్స్ పొందడం, మ్యాన్ పవర్, మంచి చెఫ్.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కస్టమర్లను ఆకట్టుకోవడం మరో ఎత్తు. అదే తొలిసారి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్టయితే వ్యాపారంలో ఎలా మసలుకోవాలో మొదట్లో అర్థం కాదు. ఒక్కో వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ఆ అనుభవాలతోనే పుణెలోనే ఫీనిక్స్ మాల్లో మరో రెస్టారెంట్ను ప్రారంభించారు.
క్వాలిటీ ఫుడ్ అందించడం, మంచి సర్వీస్ కోసం స్టాఫ్కు శిక్షణ ఇప్పించారు. రుచి విషయంలో ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఐటమ్ కస్టమర్ టేబుల్పైకి వెళ్లేవరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహారం విషయంలో మేనేజ్మెంట్ సునిశితంగా వ్యవహరించింది. తొలి ఏడాది మొత్తం ఇలా నేర్చుకోవడంతోనే సరిపోయింది. అనవసర ఖర్చులు కూడా పెరిగిపోయాయి.

హాస్పిటాలిటీ టీం..
ప్రస్తుతం ప్రతి యేడాది ఈ రెస్టారెంట్ 35 నుంచి 40 శాతం వృద్ధి చెందుతోంది. వ్యాపారం ప్రారంభించినప్పుడు బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ఆరు నెలల నుంచి ఏడాది పట్టింది. ఈ పదేళ్లలో ఒక్క పుణెలోనే ఆరు ఔట్లెట్లను ప్రారంభించారు. ఓ వైపు ఫుడ్ డెలివరీ యాప్స్, మరోవైపు ఫుడ్ టెక్ కంపెనీలు.. ఈ జోరులోనూ జహీర్ఖాన్స్ హాస్పిటాలిటీకి ఎదురులేకుండా పోయింది. మంచి ఆహారాన్ని అందిస్తుందన్న టాక్ వీరి బిజినెస్ స్థిరమైన అభివృద్ధి సాధించేలా చేసింది.
జహీర్ ఖాన్స్కు రెగ్యులర్ కస్టమర్లే ఎక్కువగా ఉంటారు. ఆరంభంలో క్రికెటర్ జహీర్ రెస్టారెంట్ అన్న కారణంతో వచ్చేవారు. ఆ తర్వాత ఫుడ్ బాగుండటంతోపటు, మంచి క్రీడావాతావరణం ఉండటంతో రిపీటెడ్గా వస్తున్నారు.
‘‘ప్రస్తుతానికైతే పుణెలోనే మరికొన్ని ఔట్లెట్స్ను ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నాం. ఆ తర్వాతే ఇతర చిన్న పట్టణాలపై దృష్టిసారిస్తాం. చిన్న నగరాల్లో స్పోర్ట్స్ బార్ అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే పుణెతోపాటు ముంబై, బెంగళూరుల్లో కూడా మా వ్యాపారాన్ని విస్తరిస్తాం’’అని జహీర్ ఖాన్ వివరించారు.
హోటల్ మార్కెట్..
దేశంలో ఫుడ్ ఇండస్ట్రీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. 2018 కల్లా ఈ ఆహార రంగం 195 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే 15% ఆరోగ్యకరమైన వృద్ధి రేటును ప్రతి యేటా నమోదు చేసుకుంటోంది. సెలబ్రిటీ పేర్లతో ప్రారంభించిన రెస్టారెంట్లు పేరు, పరపతి నిలుపుకునేలా సేవలను కూడా అందిస్తున్నాయి.
జహీర్ ఒక్కడే కాదు.. చాలామంది సెలబ్రిటీలు ఈ రెస్టారెంట్ల బిజినెస్లోకి అడుగుపెట్టారు. ముంబైలో టెండూల్కర్స్, శిల్పాశెట్టి నైట్ క్లబ్ ‘రాయల్స్’, డినో మోరియా ‘క్రేప్ సెన్సేషన్, అర్జున్ రాంపాల్, సునీల్ షెట్టిల రెస్టారెంట్లు కూడా కస్టమర్ల ఆదరణ పొందుతున్నవే.
క్రికెట్లో భారత్కు ఎనలేని సేవలు అందించిన జహీర్ ఖాన్ రెస్టారెంట్ బిజినెస్ కూడా అదిరిపోవాలని యువర్స్టోరీ ఆశిస్తోంది.

