కట్టుబాట్లతో కుంగిపోకుండా తానేంటో ప్రపంచానికి చాటిన డా.సంధ్య చెరియన్

కష్టాల సుడిగుండాలని ఎదురొడ్డి నిలిచిందినాలుగేళ్ల క్రితం భర్తను కోల్పోయిందిఅందరూ దూరం పెట్టేవారుఅనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న సంధ్య ఫ్రంటియర్ మెడివిల్లేకు వైస్ ప్రెసిడెంట్డా.కె.ఎం.చెరియన్ హార్డ్ పౌండేషన్ కు డైరక్టర్ఎల్వర్ గ్రామ ఆడపిల్లల పాలిట దేవత

కట్టుబాట్లతో కుంగిపోకుండా తానేంటో ప్రపంచానికి చాటిన   డా.సంధ్య చెరియన్

Tuesday August 25, 2015,

5 min Read

సంధ్యా చెరియన్.. ఆమె ధైర్యానికి పెట్టని కోట, కష్టాల సుడిగుండాలు ఎదురైనప్పుడల్లా ఎదురొడ్డి నిలిచింది. అయితే ఇప్పుడు ఆమె ఫ్రంటియర్ మెడివిల్లే వైస్ ప్రెసిడెంట్, ఫ్రంటియర్ లైఫ్ లైన్ ఆస్పత్రికి , డా.కె.ఎం. చెరియన్ హార్ట్ ఫౌండేషన్‌కు డైరక్టర్. సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పడు తన ఇద్దరు అమ్మాయిలతోనూ..నిత్యం తన పనిలోనూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది.

నాలుగేళ్ల క్రితం సంధ్య తన భర్తను కోల్పోయింది. రాత్రి నిద్రలోఉండగానే తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. అది కేవలం తట్టుకోలేని బాధ మాత్రమే కాదు ఊహించని పరిణామం కూడా. 

"ఆయన లేరన్న విషయాన్ని నమ్మడానికి తిరిగి సాధారణ జీవితంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. నా పిల్లల కోసం , నా కుటుంబంతో గడపటం కోసం నేను తిరిగి ఇండియా వచ్చేయాలనుకున్నాను. రెండేళ్ల క్రితం అమెరికా నుంచి చెన్నై వచ్చేశాను."

ప్రస్తుతం ఆమె ఫ్రంటియర్ లైఫ్ లైన్ హాస్పటల్, కార్డియాక్ సూపర్ స్పెషాలిటీ సెంటర్ మరియు మెడికల్ బయోసైన్స్ పార్క్ ఫ్రంటియర్ మెడివిల్లే పరిపాలనా సంబంధ విషయాల్లో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు." భారత దేశంలో చాలా మంది శస్త్రచికిత్సలకయ్యే ఖర్చును తట్టుకోలేకపోతున్నారు. కారణం ఇక్కడ శస్త్రచికిత్సలో ఉపయోగించే ఇంప్లాంటబుల్స్, పరికరాలు, వాడి పడేసే వస్తువుల ఖరీదు చాలా ఎక్కువ. మేం సొంతంగా ఇంప్లాంటబుల్స్ తయారు చేసి ఆ ఖర్చును తగ్గించే ప్రయత్నం చేద్దామనుకున్నాం. పరిశోధనల్ని మొదలుపెట్టాం.ఆ విధంగా ఫ్రంటియర్ లైఫ్ లైన్ ఆస్పత్రిలో పరిశోధన విభాగం ప్రారంభయ్యింది. ఫ్రంటియర్ మెడివిల్లె ప్రారంభించడం వెనుక ఉద్ధేశం కూడా అదే."

డా. సంద్య చెరియన్

డా. సంద్య చెరియన్


అయితే ఇండియా తిరిగివచ్చిన తరువాత సంధ్యకు ఇక్కడ చిన్న వయసులో భర్త కోల్పోయిన ఓ మహిళ జీవితం ఎలా ఉంటుందోనన్న కఠోర సత్యం తెలిసొచ్చింది. సామాజిక బహిష్కరణను ఎదుర్కోవలసి వచ్చేది. సాధారణంగా స్నేహితులు, బంధువులు తమ కుటుంబసభ్యులను పెళ్లిళ్లకు పేరంటాలకు పిలిచినప్పుడు తనను మాత్రం పక్కనబెట్టేవారు." నాకు బాగా కావాల్సిన వాళ్లు అనుకున్న వాళ్లు కూడా నువ్వు విధవరాలిగా కనిపించొద్దు అంటూ ఉండేవారు".

చుట్టూ ఉన్న వాళ్ల ఆలోచనలు నిజంగానే నన్ను ఓ ముసలిదాన్నో.. లేదా అశుభంగా చేసేశాయి. ఈ వివక్ష నాతోనే ఆగిపోలేదు. యుగాలుగా ఈ దేశంలో వితంతువులంటే అపశకునంగానే భావిస్తారు. మొదట్లో నాకు ఇది చాలా బాధ కల్గించేది. కానీ ఆ తరువాత పట్టించుకోవడం మానేశాను. ఇవన్నీ కూడా నాకు నిజంగా నావాళ్లెవరన్న సత్యాన్ని తెలియజేశాయి. ఈ అనుభవాలను నాలో మార్పును తీసుకొచ్చాయి. నా వ్యక్తిత్వాన్ని మార్చేశాయి. గత నాలుగైదేళ్లుగా అన్నింటిని తట్టుకునే నిలిచేలా తయారు చేశాయి.

"ధైర్యంగా ఉండండి. "యుక్తవయుసులోనే వితంతువులుగా మారిన వారినికి నేనిచ్చే సలహా అదే. "కాలమే గాయానికి మందు. మీ పట్ల చుట్టూ ఉన్న వాళ్ల తీరు , సూటిపోటి మాటలు, వీటన్నింటికి కాలమే సరైన సమాధానం." అంటారు సంధ్య.

మెడిసిన్ పై మక్కువ

తన తల్లిదండ్రులిద్దరు వైద్య రంగంగోలోనే పని చేస్తుండటం వల్ల సంధ్య ఎక్కువ సమయం ఆస్పత్రుల్లోనే గడిపేది. ఇవాళ్టికి కూడా పనిలో నిత్యం తనకెదురయ్యే సవాళ్లను సంతోషంగా స్వీకరిస్తుంది. తండ్రి కార్డియాలజిస్ట్ ,తనకు కూడా సైన్స్ అంటే ఎంతో మక్కువ. తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంది.

కానీ దురదృష్టవశాత్తు మెడిసిన్ రంగంలో ఆమె ప్రవేశించడం తన తండ్రికి పెద్దగా ఇష్టం లేదు. మహిళలు ఇటు వృత్తి జీవితం, అటు కుటుంబ జీవితం మధ్య నలిగిపోతూ వైద్యవృత్తికి సరైన న్యాయం చెయ్యలేరన్నది ఆయన అభిప్రాయం. " దాంతో నా ఇష్ట ప్రకారం నా కెరియర్‌ను ఎంచుకునే పరిస్థితి లేకపోయింది. కానీ ఈ తరం మాత్రం తమ అభిప్రాయాలను వెల్లడించడమే కాదు.. కలలను నెరవేర్చుకుంటున్నారు కూడా. అయితే అప్పట్లో నాకంత ధైర్యం ఉండేది కాదు. ఇంట్లో వాళ్లు చెప్పినట్లు నడుచుకోవడం తప్ప." అంటారు సంధ్య.

ఉన్న ఆప్షన్లలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తన ఇష్టానికి దగ్గరగా ఉన్న కోర్సు అందుకే ఆరంగంలోనే ఆమె ముందుకెళ్దామనుకుంది. అందరికన్నా ముందు ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయుల్లో తన తండ్రి కూడా ఒకరు. కొంత కాలానికి అక్కడ నుంచి న్యూజిలాండ్ వెళ్లారు. తన బాల్యామంతా ఆ రెండు దేశాల్లోనే గడిపింది సంధ్య. తిరిగి ఇండియా వచ్చిన తరువాత వాళ్ల కుటుంబం చెన్నైలో స్థిరపడింది. గిండిలోని అన్నా యూనివర్శిటిలో బ్యాచిలర్ డిగ్రీ చేసింది సంధ్య. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ తరువాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, క్లినికల్ రీసెర్చ్ , ఫార్మాకో విజిలెన్స్ విభాగాల్లో పీజీ చేసింది.

1995లో అంటే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న సమయంలోనే ఆమెకు వివాహమయ్యింది. కొన్నేళ్లు మద్రాస్ మెడికల్ మిషన్లో పని చేసిన తరువాత తన భర్త ఉద్యోగ రీత్యా బహ్రెయిన్‌కు వెళ్లిపోయింది. 2004 వరకు అక్కడే ఉన్న సంధ్య ఆ తరువాత అమెరికా వెళ్లిపోయారు.

మనసుకు నచ్చిందే చేయాలి

సంధ్య తాను కలలు కన్న రంగంలో అడుగుపెట్టలేకపోవచ్చు. కానీ తన పిల్లలకు మాత్రం వాళ్లకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చారు. తన పిల్లలతో కలిసి ఎల్వర్‌లో ఆడపిల్లల్ని విద్యావంతుల్ని చేసే బాధ్యతల్ని భుజాన వేసుకున్న తన తండ్రి ట్రస్టులో పనిచెయ్యడం మొదలెట్టారు.

చెన్నైకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువళ్లూర్ జిల్లాలోని ఎల్వర్ గ్రామ సమీపంలో సుమారు 360 ఎకరాల విస్తీర్ణంలో ఫ్రంటియర్ మెడివిల్లె ఉంది. ఆరోగ్య భద్రత, విద్య, శిక్షణ, పరిశోధన, ఒప్పంద పరిశోధనలతో పాటు ఇతర ఔట్ సోర్సింగ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేశారు.

ఆడపిల్లకు విద్య నేర్పడమంటే అంటే ఆ కుటుంబమంతటినీ విద్యావంతుల్ని చేసేనట్టే. ఇవాళ ఆడపిల్లను తన కాళ్లపై తాను నిలబడేలా చేయగల్గితే భవిష్యత్తులో ఆమె కుటుంబం బాగుపడుతుంది. రేపు దేశమంతా బాగుపడుతుంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్ధేశంతోనే ఫ్రంటియర్ మెడివెల్లే తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల వారిని ఎంపిక చేసుకుంది. వారిని సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడానికి అవసరమైన వైజ్ఞానిక శిక్షణా తరగతుల్ని నిర్వహించింది. కేవలం గ్రామీణ ప్రాంత మహిళల్ని విద్యావంతుల్ని చెయ్యడం మాత్రమే కాదు వాళ్లకు తగిన ఉపాధి అవకాశాల్ను కల్పిచడం కూడా తన లక్ష్యంగా పెట్టుకుంది మెడివెల్లె సంస్థ.

2007 నుంచి ఎల్వర్ గ్రామంలో కేవలం తల్లి సంరక్షణలోనే ఉన్న 21 మంది ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పించింది వారి ఎడ్యుకేషనల్ ట్రస్ట్. నర్సరీ నుంచి సీనియర్ సెకండరీ లెవల్ ఎడ్యుకేషన్ వరకూ వారి ట్యూషన్ ఫీజులు, ట్రాన్స్ పోర్టు, పుస్తకాలు, యూనిఫాంలు ఇతర అన్ని అవసరాలను ట్రస్టే చూసుకునేది.

"విశేషమేంటంటే.. తాము చేపట్టిన కార్యక్రమం ఆ పిల్లల్లో తాము పేదరికం నుంచి వచ్చామన్న సంగతిని మర్చిపోయి మిగిలిన విద్యార్థులందరితోనూ కలిసిపోయేలా చేసింది. అప్పుడే దీని వల్ల ఫలితాలు కూడా రావడం మొదలయ్యింది. కొద్ది మంది పిల్లలు తమ తల్లుల్ని కూడా సాధికారత సాధించే దిశగా నడిపిస్తున్నారు." అంటారు సంధ్య.

అంతేకాదు ఎల్వర్ గ్రామంలోని యువతుల్లో వచ్చిన మార్పు గురించి సంధ్య చాలా ఉద్వేగంగా చెబుతారు. ఫ్రంటియర్ మెడివెల్లే ఆ గ్రామంలోని ఆరుగురు నిరుపేద యువతుల్ని ఎంపిక చేసింది. వాళ్లు పది , పన్నెండు తరగతులు పూర్తి చేసిన అమ్మాయిలు. వాళ్లకు బయోటెక్నాలజీ, టిష్యూ ఇంజినీరింగ్, నానో కోటింగ్ వంటి విభాగాల్లో సాంకేతిక పరమైన శిక్షణనిచ్చింది. అంతే కాదు.. వాళ్లకు ఉచిత భోజన, వసతి కల్పించి ప్రతి నెలా కొంత స్టైఫండ్ కూడా ఇచ్చింది. ఫ్రంటియర్ మెడివెల్లె సంస్థ. శిక్షణ అనంతరం వాళ్లను అదే సంస్థలో శాశ్వత ఉద్యోగులుగా అవకాశం కల్పించింది. ఇవాళ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడ్డారు. చక్కగా సంపాదిస్తున్నారు. ఊళ్లో వాళ్లందరికీ ఆదర్శంగా నిలిచారు. రోజూ చక్కగా స్కూటీపై వాళ్లు ఉద్యోగానికెళ్తుంటే ఆ గ్రామంలో చాలా మంది అమ్మాయిలు వాళ్ల అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నారు.

image


ఒక తల్లి పాత్రలో...

"సింగిల్ పేరెంట్ గా ఉండటం నేనెదుర్కొన్న అతి పెద్ద సవాల్. పని చేస్తూ కాస్త మర్చిపోయే ప్రయత్నం చేసినా .. నా వల్ల అయ్యేది కాదు. కొన్ని సార్లు నాలో నేనే కుమిలిపోయేదాన్ని. ఇంటికెళ్లిన తరువాత నా ఇద్దరు పిల్లల బాధ్యత నాపైనే ఉండేది."-- సంధ్య

కొన్ని సార్లు బాగా అలసిపోయినట్లనిపించేది సంధ్యకు. ఆ సమయంలో ఉన్న కొద్ది పాటి శక్తితో ఇతర వ్యాపకాలపై దృష్టి సారించేది.

"ఇన్ని పెద్ద పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కోగలనా అని ఒక్కోసారి నాకు భయం కలుగుతుంది. ఇద్దరి అమ్మాయిల్ని చదివించాలి. వాళ్లను స్వతంత్రంగా ఎదిగేలా చెయ్యాలి, ఏదో ఒక రోజు వాళ్లకు పెళ్లిళ్లు చెయ్యాలి. అలా ఆలోచించినప్పుడల్లా కచ్చితంగా చేయగలనని నాకు నేను సమాధానం చెప్పుకుంటూ ఉండేదాన్ని. నా బిడ్డల్ని మానసికంగా బలవంతుల్ని చెయ్యడం, ఎలాంటి సందర్భాన్నైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడం ఇవే నేను వాళ్లకు చెయ్యగల్గిన మంచి పనులు.

నిరంతరం స్ఫూర్తి పొందడం

సంధ్యకు ఆమె తండ్రికి మించిన స్ఫూర్తి ఇంకెవరూ లేరు. "నేను ఆయనకు సంబంధించి అత్యంత దుర్భర స్థితిని కూడా చూశాను. కానీ 60 ఏళ్లు వచ్చేసరికి ఆయన బూడిద నుంచి పైకెగిరిన ఫినెక్స్ పక్షిలా ఉన్నతస్థితికి ఎదిగారు"

ఆమె పిల్లలు కూడా ప్రేరణ కల్గించడంలో ప్రముఖ పాత్ర పోషించారు." వాళ్లే నా ప్రపంచం నా ఉన్నత వ్యక్తిత్వానికి వాళ్లు కూడా స్ఫూర్తే."

జీవితంలో కొన్ని సార్లు నిజంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితులు ఓడించాలని ప్రయత్నిస్తుంటాయి. మనం ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోతే దురదృష్టవశాత్తు జీవితం అక్కడితో ఆగిపోతుంది. నీ పరిస్థితి మెరుగుపడాలంటే ఎంత కష్టమైనా సరే నిన్ను ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని నువ్వు వెతుక్కోవలసిందే." సంధ్య చెప్పదల్చుకున్నది ఇదే. ఎల్లప్పుడూ దృఢంగా ఉండాలి. ముందుకు సాగిపోవాలి.

    Share on
    close