వందల కోట్ల ట‌ర్నోవ‌ర్ లెక్కలన్నీ మరిచిపోండి- మేక్ మై ట్రిప్ చీఫ్ దీప్ కల్రా

వందల కోట్ల ట‌ర్నోవ‌ర్ లెక్కలన్నీ మరిచిపోండి- మేక్ మై ట్రిప్ చీఫ్ దీప్ కల్రా

Saturday November 19, 2016,

2 min Read

పేప‌ర్లో చ‌దివే ఉంటారు. గ‌త నెల ఇండియ‌న్ స్టార్ట‌ప్ ఇకో సిస్ట‌మ్ లో ఒక అద్భుతం జ‌రిగింది. ఆన్ లైన్ ట్రావెల్ రంగంలో పోటీ ప‌డే రెండు దిగ్గ‌జ‌ కంపెనీలు చేతులు క‌లిపి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాయి. అవి మేక్ మై ట్రిప్, గో ఐబిబో! ఇంతకూ ఆ క‌ల‌యిక ఎలా జ‌రిగింది? అంత పెద్ద డీల్ వెన‌క ఆంత‌ర్య‌మేంటి? ఆ వివ‌రాల‌ను మేక్ మై ట్రిప్ సీఈవో, చైర్ ప‌ర్స‌న్ దీప్ క‌ల్రా వెల్ల‌డించారు. యువ‌ర్ స్టోరీ మొబైల్ స్పార్క్స్-2016లో ప్ర‌సంగించిన దీప్ క‌ల్రా.. మేక్ మై ట్రిప్ ఎదుర్కొన్న ఆటుపోట్ల‌ను, ఆయ‌న జీవిత అనుభ‌వాల‌ను ఆంట్ర‌ప్రెన్యూర్ల‌తో పంచుకున్నారు. ఆ వివ‌రాలు దీప్ క‌ల్రా మాట‌ల్లోనే...

ప్రారంభించిన కొన్నాళ్ల‌కే మేక్ మై ట్రిప్ వ్యాపారం స‌క్సెస్ అయింది. రానురాను పోటీ పెరిగింది. 2012-13 వ‌ర‌కు ఎక్స్ పీడియా లాంటి కంపెనీల‌తో గ‌ట్టి పోటీ ఎదుర్కుంటూ వ‌చ్చాం. 2013-14 త‌ర్వాత గోఐబిబో ఎంట‌రైంది. ఆ కంపెనీ అద్భుతాలు చేసింది. గోఐబిబో టెక్నాలజీ సామ‌ర్థ్యం, ఆదాయం చూసి షాక‌య్యాం. మాతో పోలిస్తే స‌మ‌కాలీన టెక్నాల‌జీని వినియోగించ‌డ‌మే వాళ్ల స‌క్సెస్ సూత్ర‌మ‌ని తెలుసుకున్నాం. అదే మ‌మ్మ‌ల్ని ఒప్పందం దిశ‌గా మోటివేట్ చేసింది. డీల్ ఓకే అయింది కానీ.. ఇంకా రెండు అనుమ‌తులు రావాల్సి ఉంది. ఒక‌టి- షేర్ హోల్డ‌ర్ల ఓటింగ్. రెండోది- కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా అనుమ‌తి.

ఇక మా కంపెనీ విష‌యానికొస్తే.. వ్యాపారంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాం. నిజానికి భార‌త్ లో ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ ప‌రిధి చాలా పెద్ద‌ది. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవాలంటే డిస్కౌంట్లు త‌ప్ప‌నిస‌రి. కానీ మేం ఒక ఏడాది పాటు డిస్కౌంట్లు నిలిపేసి త‌ప్పు చేశాం. ఆ దెబ్బ‌తో ఆద‌ర‌ణ కోల్పోయాం. ఇక‌మీద‌ట అలాంటి పొర‌పాటు చేయం. గోఐబిబోతో క‌లిసి మ‌ళ్లీ డిస్కౌంట్లు తీసుకొస్తాం. ఆదాయం పెంచుకుంటాం.

image


వాస్త‌వానికి 2012 త‌ర్వాత రెండేళ్ల దాకా మా ఆదాయం బాగానే ఉండేది. కింగ్ ఫిష‌ర్ ప‌త‌నం త‌ర్వాత ఆ ప్ర‌భావం ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద కూడా ప‌డింది. దాంతో న‌ష్టాలొచ్చాయి. ఆన్ లైన్ ట్రావెల్ బిజ‌నెస్ లో పిస‌రంత ఆదాయం ఏ మూల‌కు స‌రిపోదు. అందుకే ఎయిర్ టికెట్లు మొద‌లు పెట్టాం. దాంతోపాటు క‌స్ట‌మ‌ర్ల‌కు హోట‌ళ్లు, ఇత‌ర అనుబంధ స‌దుపాయాలు కల్పించాం.

ఆంట్ర‌ప్రెన్యూర్ల‌కు క‌ష్టాలు సహ‌జ‌మే. ఆ క‌ష్టాల క‌డ‌లిని ఈదిన‌ప్పుడే విజ‌యాలు వ‌రిస్తాయి. ఏబీఎన్ ఆమ్రో, జీఈ క్యాపిట‌ల్ లో దిగ్గ‌జాల‌తో కలిసి ప‌నిచేసిన‌ప్పుడు.. ఒక విష‌యం నేర్చుకున్నాను.. ఎంత క‌ష్ట‌మైనా రానీ.. సైలెంట్ గా ఉండిపోవాలంతే! ప‌రిష్కారం దానంత‌ట‌దే దొరుకుతుంది. అంతెందుకు, నేను కూడా కొన్ని సార్లు అప్ సెట్ అయిపోతుంటా. ఎప్పుడో ఒక‌సారి విప‌రీతంగా కోపం వ‌స్తుంటుంది. కానీ దాన్ని అధిగ‌మించాలి. చేసిన త‌ప్పులు కాకుండా కొత్త త‌ప్పులు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా. ఎవ‌రైనా మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తే నాకు చిరాకు.

గ‌త రెండేళ్ల‌లో చాలా కంపెనీలు వంద కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించామ‌ని చెప్పుకున్న‌ సంఘ‌ట‌న‌లు చూశాం. అయితే అదేమంత ముఖ్యం కాదు. కంపెనీ విలువను పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. ఆ లెక్క‌లు కాగితాల వ‌ర‌కే. కాబ‌ట్టి అవ‌న్నీ మ‌ర్చిపోండి. మీ శ్ర‌మ‌ను న‌మ్ముకోండి. కంపెనీ విలువ దానంత‌ట‌దే పెరుగుతుంది.

ఇక చివ‌ర‌గా ఒక విషయం! ఎవ‌రైనా వ‌చ్చి 200 కోట్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పార‌నుకోండి. వెంట‌నే లౌక్యం ఉప‌యోగించండి. ఎలాగైనా స‌రే ఆ ఇన్వెస్ట్ మెంట్ ను చేజిక్కించుకోండి. ఈ పోటీ ప్ర‌పంచంలో ఏమాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా.. అవ‌త‌లివాళ్లు అవ‌కాశాల‌ను ఎగ‌రేసుకుపోతారు అని ముగించారు దీప్ క‌ల్రా.