మహిళాభ్యుదయం నా మొదటి ప్రాధాన్యం - రుక్మిణీరావు

అబ్బాయిల‌తో స‌మానంగా పెరిగి.. అబ్బాయిల‌తో పోటీ ప‌డి చ‌దివి...ఇప్పుడు మ‌హిళ‌ల స్వావ‌లంబ‌న కోసం జీవితాంతం పోరాడుతున్నారు రుక్మిణి రావు. త‌న ఆశ‌య‌ సాధ‌న‌కు అడ్డం వ‌స్తే, వైవాహిక జీవితాన్ని కూడా ఆమె లెక్క‌చేయరు.

మహిళాభ్యుదయం నా మొదటి ప్రాధాన్యం - రుక్మిణీరావు

Tuesday August 18, 2015,

3 min Read

నా బాల్యం చాలా ఆనందంగా గ‌డిచింది. ఇంటినిండా ఆడ‌వాళ్ళే. అవ్వ‌, నాన‌మ్మ‌, అమ్మ, అత్త‌, వీళ్లే ఇంటిని నడిపేవాళ్ళు”. బాల్యం గుర్తు చేసుకున్న‌ప్పుడ‌ల్లా ప్రాణం లేచొస్తుంది రుక్మిణి రావుకి. సామాజిక కార్య‌క‌ర్త‌గా, గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న యాక్టివిస్ట్‌గా రుక్మిణి ఈ మ‌ధ్యే సోష‌ల్ ఇంపాక్ట్ క్యాట‌గ‌రీలో ఫెమినా అవార్డ్ కూడా గెలుచుకున్నారు.

హైద‌రాబాద్‌‌లో పుట్టిపెరిగిన రుక్మిణీ రావు చిన్న‌ప్ప‌టి నుంచి అన్నద‌మ్ముల‌తో స‌మానంగానే పెరిగారు. “మా అవ్వ న‌న్ను, నా ఇద్ద‌రు సోద‌రుల‌ని ఒకేలా చూసేవారు. సెల‌వుల‌కు బ‌య‌టికెళ్ళిన‌ప్పుడు ముగ్గురికి స‌మానంగా డ‌బ్బులిచ్చేవారు. మాకిష్ట‌మైన‌వి కొనుక్కునేవాళ్ళం” అని గుర్తు చేసుకున్నారు రుక్మిణి. తనకి రెండేళ్ళ వ‌య‌సున్న‌ప్పుడే ఆమె తండ్రి చ‌నిపోయారు. కానీ ఆ లోటు తెలియ‌కుండా పెంచారు ఆమె త‌ల్లి. ఊర్లో వీలైనంత మంచి స్కూల్లోనే రుక్మిణి చ‌దివారు. బాగా చ‌దువుకోవాల‌నే ఆమె త‌ల్లి ఎప్పుడూ చెబుతూ వుండేవారు. పైచ‌దువులు చ‌దువుకోమ‌ని ప్రోత్స‌హించేవారు.

చిన్న‌ప్పట్నుంచి రుక్మిణికి టీచింగ్ అంటే ఇష్టం. ఉస్మానియాలో సైకాల‌జీ మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజీలో లెక్చ‌ర‌ర్ గా చేరారు. ఆ త‌ర్వాత త‌ల్లి ప్రోత్సాహంతో మ‌రింత ఉన్న‌త చ‌దువుల కోసం ఢిల్లీ వెళ్ళారు.

రుక్మిణీరావు

రుక్మిణీరావు


1974లో రుక్మిణి సైకాల‌జీలో పి హెచ్ డి పూర్తి చేసారు. ఆ త‌ర్వాత ఢిల్లీలోనే నేష‌న‌ల్ లేబ‌ర్ ఇన్స్‌టిట్యూట్ అండ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్ సెంట‌ర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేష‌న్ లో కొన్నేళ్ళ పాటు ఉద్యోగం చేసారు.

అయితే, 1980ల‌లో పెరుగుతున్న వ‌ర‌క‌ట్న చావులు రుక్మిణి జీవితాన్ని మ‌లుపుతిప్పాయి. త‌న‌లాంటి మ‌రికొంత మంది మిత్రుల‌తో క‌లిసి ఈ దురాచారానికి వ్య‌తిరేకంగా రుక్మిణి ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. వంటింట్లో ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణాలుగా ముగిసిపోతున్న ఈ కేసుల్లో తిరిగి విచార‌ణ జ‌రిపించాల‌ని రుక్మిణి డిమాండ్ చేసారు. ఇలా కొన్ని ఘ‌ట‌న‌ల్లో ధర్నాలు, డిమాండ్ల త‌ర్వాత ఇంత‌కు మించి క్రియాశీల‌కంగా ఏమైనా చేయాల‌ని రుక్మిణి నిర్ణ‌యించుకున్నారు. ఆ ఆలోచ‌నే త‌ర్వాతి రోజుల్లో స‌హేలీ రిసోర్స్ సెంట‌ర్ ఫ‌ర్ విమెన్‌గా మారింది. 1981లో రుక్మిణి ఈ సంస్థ‌ను స్థాపించారు.

ఆ త‌ర్వాత 1989లో రుక్మిణి మ‌ళ్ళీ హైద‌రాబాద్ వ‌చ్చేసారు. ప‌ట్ట‌ణాల్లో కంటే ప‌ల్లెల్లో వ‌ర‌కట్న స‌మ‌స్య ఎక్కువ‌గా వుంద‌ని గ్ర‌హించి వారికి అండ‌గా నిల‌బ‌డాల‌ని భావించారు. చ‌ట్టాల్లో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల ప‌ట్ట‌ణాల్లోని మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌లు కోర్టుల‌ను ఆశ్ర‌యించి ఎంతో కొంత న్యాయం పొంది అవ‌కాశాలుండేవి. కానీ గ్రామాల్లో ఆ ప‌రిస్థితి లేదు.

“ గ్రామీణాభివృద్ధి ప‌థ‌కాల‌తోనే గ్రామాల్లో మ‌హిళ‌ల ప‌రిస్థితి మెరుగుప‌రిచే ప్ర‌య‌త్నం చేయాల‌నుకున్నాను. హైద‌రాబాద్ నా సొంత ఊరు కాబ‌ట్టీ అక్క‌డైతే మ‌రింత మెరుగ్గా ప‌నిచేయొచ్చ‌నిపించి ఢిల్లీ నుంచి ఇక్క‌డికి వ‌చ్చేసాను ” అంటారు రుక్మిణి.
గ్రామీణ ప్రాంతం లో ని ఓ స్కూల్ లో రుక్మిణి  రావు

గ్రామీణ ప్రాంతం లో ని ఓ స్కూల్ లో రుక్మిణి రావు


ఆ త‌ర్వాత ఆమె కొన్నేళ్ళు డెక్క‌న్ డెవ‌ల‌ప్మెంట్ సొసైటీతో క‌లిసి గ్రామీణ మ‌హిళా రైతుల హ‌క్కుల కోసం పోరాడారు. మ‌హిళ‌ల్లో నాయ‌క‌త్వ ప‌టిమ‌ను పెంచ‌డ‌మే డిడిఎస్‌లో ఆమె ఉద్యోగం. స‌మాజంలో మహిళ‌ల స్థానం, ప్ర‌భుత్వ అధికారుల‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన విధానం లాంటి విష‌యాల్లో గ్రామీణ మహిళ‌ల‌కు ఆమె అనేక వ‌ర్క్ షాప్‌లు నిర్వ‌హించారు. రుక్మిణి ఇప్పుడు ఈ సంస్థ‌కు డైర‌క్ట‌ర్ , బోర్డ్ మెంబ‌ర్ కూడా.

ఓ గ్రామంలో ఆడ‌పిల్ల‌ల‌ను అమ్మేస్తుంటే, దాన్ని నివారించ‌డానికి 1997లో గ్రామ రిసోర్స్ సెంట‌ర్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మొదలు పెట్టారు రుక్మిణి. ఆ త‌ర్వాత తన స్నేహితురాలు జ‌మున తో క‌లిసి ఎన్‌జీవోల‌కు అండ‌గా నిలిచే మ‌రో సంస్థ‌ను ఏర్పాటు చేసారు. ఈ సంస్థ త‌న మొద‌టి కార్య‌క్ర‌మాన్ని చందంపేట మండ‌లంలో చేప‌ట్టింది.

అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 12 మారుమూల గ్రామంలో విద్య‌ను అందిస్తూ, అక్క‌డ మ‌హిళా గ్రూపుల‌ను ఏర్పాటు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇలా దాదాపు 800 మంది మ‌హిళ‌ల‌తో ఏర్పాటైన ఈ గ్రూపులు మ‌హిళల జీవన విధానంలో మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా, ఆడ‌పిల్ల‌ల్ని చూసే దృష్టిలో కూడా మార్పు తీసుకొచ్చాయి. అనేక ఏళ్ళు ఈ రంగంలో ప‌ని చేసిన అనుభ‌వం రుక్మిణికి మ‌రికొన్ని పాఠాలు నేర్పింది. భ్రూణ హ‌త్య‌లే కాకుండా అంత‌ర్జాతీయ అడాప్ష‌న్ సెంట‌ర్ల పేరుతో ఆడ‌పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణా కూడా జ‌రుగుతోంద‌ని ఆమె గుర్తించారు. దీనిపై ఎడ‌తెగ‌ని ఉద్య‌మాల ఫ‌లితంగా, అనేక అక్ర‌మ అడాప్ష‌న్ సెంట‌ర్ల‌ను మూయించ‌గ‌లిగారు.

దాటిన మైలురాళ్ళు

ఇండియా, ఆస్ట్రేలియా, యూర‌ప్, చైనాల‌లో రుక్మిణి రావుకి ప్ర‌తిష్టాత్మ‌క ఫెలోషిప్‌లు వున్నాయి. అనేక అంత‌ర్జాతీయ కాన్ఫ‌రెన్స్‌లు సెమినార్ల‌లో ఆమె ప్ర‌సంగించారు. మ‌హిళా సమ‌స్య‌ల‌పై వ‌ర్క‌షాప్‌లు నిర్వ‌హించారు. మ‌న‌దేశంతో పాటు యూరోప్, ఆస్ట్రేలియాల‌లో డెవ‌ల‌ప్‌మెంట్ ఎడ్యుకేష‌న్ పై ఆమె ఎన్నో లెక్చ‌ర్లు ఇచ్చారు.

పోరాట‌మే ఆద‌ర్శం

నిజాముద్దీన్ బ‌స్తీలోని ఓ నిరుపేద మ‌హిళ క‌మల.. రుక్మిణికి ఆద‌ర్శం. “తాగుబోతు భ‌ర్తను భ‌రిస్తూ, న‌లుగురు పిల్ల‌ల్ని చూసుకుంటూ, నాలుగిళ్ళ‌లో ప‌నిచేస్తూ కూడా క‌మ‌లా స‌హేలీలో చాలా క్రియాశీల‌కంగా ప‌నిచేసేది. నిస్పృహ‌లో వుండే అనేక‌మంది మ‌హిళ‌లకు ధైర్యాన్నిచ్చేది. మా సంస్థ‌కు ఆర్ధికంగా క‌ష్టాలొచ్చిన‌ప్పుడు, అయిదేసి రూపాయ‌లు చందాలు వ‌సూలు చేసేది. పేద‌ల‌లో వుండే దాతృత్వం చూసి మ‌నం నేర్చుకోవాల్సింది చాలా వుంది..” అంటారు రుక్మిణి.

స్వ‌తంత్ర భావాల‌కే ప్రాధాన్యం..

ప‌ద్దెనిమిదేళ్ళ‌కే ఓ ఉమ్మ‌డికుటుంబంలో కోడ‌లిగా వ‌చ్చిన రుక్మిణి ఆ వాతావ‌ర‌ణంలో ఇమ‌డ‌లేక‌పోయారు. 24ఏళ్ళ వ‌య‌సులో కొడుకుని భ‌ర్త ద‌గ్గ‌రే వుంచేసి ఇల్లు వ‌దిలి బ‌య‌టికొచ్చేసారు. రెండో సారి పెళ్ళి చేసుకున్నా.. ఆ వివాహం కూడా ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ''ప్ర‌ధానంగా నేను స‌ర్వ‌స్వ‌తంత్రురాలిగా వుండడానికే ఇష్ట‌ప‌డ‌తాను. నాకు న‌చ్చిన ప‌నులే చేస్తాను'' అంటారు రుక్మిణి.

కుగ్రామం లో చంటి  బిడ్డ తో రుక్మిణి రావు

కుగ్రామం లో చంటి బిడ్డ తో రుక్మిణి రావు