మేనేజ్‌మెంట్ ట్రైనీ టు మేనేజింగ్ డైరెక్టర్ - చందాకొచ్చర్ సక్సెస్ స్టోరీ

22 సంవత్సరాల వయసులో ఐసిఐసిఐలో ఎంట్రీసీఎండీ స్థాయికి చేరిన మేనేజ్‌మెంట్ ట్రైనీఅత్యంత ప్రభావశీలురైన మహిళల జాబితాలో పదేళ్లుగా స్థానంబ్యాంకింగ్ రంగంలో దిగ్గజంగా ఎదిగిన చందాకొచ్చర్

మేనేజ్‌మెంట్ ట్రైనీ టు మేనేజింగ్ డైరెక్టర్ - చందాకొచ్చర్ సక్సెస్ స్టోరీ

Friday May 22, 2015,

3 min Read

మహిళలంటే కేవలం వంటింటి కుందేళ్ళని భావించే రోజుల్లోనే వ్యాపార రంగానికే వన్నె తెచ్చారు కొందరు వనితాముర్తులు. ఎల్లలు లేని వ్యాపార ప్రపంచంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ మహిళలు.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానంగా కుటుంబ భారమే తప్ప మరో వ్యాపకమంటూ ఆడవాళ్ళకు ఉండటమే ఊహించుకోలేని భారత్‌ వంటి సాంప్రదాయక దేశాలలో జన్మించి.. మరో రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించడమంటే మాటలు కాదు.. అయినా స్త్రీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూ, అందరి మన్ననలు పొందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తికిరిటాన్ని ఎగురవేసినవారూ లేకపోలేదు. ప్రముఖ సంస్థల వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ.. అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నవారెందరో ఉన్నారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో చందాకొచ్చర్

ప్రపంచ ఆర్థిక సదస్సులో చందాకొచ్చర్


అలాంటివారిలో ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఐసిఐసిఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న చందా కొచ్చర్‌ ఒకరు. ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చందా కొచ్చార్‌ నవంబర్‌ 17, 1961లో జన్మించా రు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన చందా.. ముంబాయికి వలస వచ్చారు. అక్కడి జైహింద్‌ కాలేజ్‌లో బ్యాచ్‌లర్‌ ఆర్ట్స్‌ను పూర్తి చేసిన కొచ్చర్‌.. జమ్నలాల్‌ బజాజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీని సంపాదించారు. ఈ క్రమంలోనే అసమాన ప్రతిభను ప్రదర్శించిన కారణంగా కాలేజ్‌ యాజమాన్యం నుంచి గోల్డ్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందుకున్నారు చందాకొచ్చర్‌. అదే ఏడాది కాస్ట్‌ అకౌంటెన్సీలో అత్యధిక మార్కులు సాధించినందుకుగానూ..గోల్డ్‌ మెడల్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఐసిఐసిఐలో ఒక్కో అడుగు ఎక్కిన వైనం

ఆ తర్వాత 1984లో ఇండస్ట్రియల్‌ క్రెడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐసిఐసిఐ) లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరిన కొచ్చర్‌.. వివిధ రంగాల నిర్వహణలో నైపుణ్యాన్ని సంపాదించారు. ఇక ఇక్కడి నుంచి చందాకొచ్చర్‌ వ్యాపార రంగ బాధ్యతలను స్వీకరించారు. 1993లో ఐసిఐసిఐ బ్యాంక్‌లో ప్రవేశించిన కొచ్చర్‌... ఏడాదికే అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ హోదాకు చేరుకున్నారు. బ్యాంక్‌లో చేరే సమయంలో చందా వయస్సు 22 సంవత్సరాలు. చందా కొచ్చర్‌ పనితనాన్ని గమనించిన మేనేజింగ్‌ డైరెక్టర్‌, సి.ఈ.ఓ కె.వి.కామత్‌ ఆమెకు మంచి అవకాశం ఇచ్చారు. 1996లో డిప్యూటి జనరల్‌ మేనేజర్‌గా నియామకమైన కొచ్చర్‌... రెండేళ్ళ తరువాత జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు.అంతకు ముందు కొచ్చర్‌ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతం కావడం తో, 1999లో స్ట్రాటజీ, ఈ-కామర్స్‌ డివిజన్స్‌ను కొచ్చర్‌ నాయకత్వంలో ఐసిఐసిఐ ఏర్పాటు చేసింది.

సంక్షోభం సమయంలో సమగ్ర వ్యూహం

ఈ సమయంలోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో ఐసిఐసిఐ బ్యాంక్‌ కీలక పాత్ర పొషించే స్థాయికి ఎదిగింది. దీంతో 2006లో డిప్యూటి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదవి బాధ్యతలను చేపట్టిన కొచ్చర్‌... అనంతర కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించారు. 2009లో కొచ్చర్‌కు ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌తోపాటు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. కొద్ది నెలల విరామం తర్వాత 2009 మేలో ఐసిఐసిఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ స్థానాలను అధిష్టించారు. 20 ఏళ్లకుపైగా ఐసిఐసిఐ సంస్థలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు చందాకొచ్చర్‌. 2008-09 ఆర్థిక సంక్షోభం సమయంలో ఆ ప్రభావం బ్యాంక్‌పై పడకుండా ఉండేందుకు చందా 4-సి వ్యూహాన్ని సిద్ధం చేశారు. దాంతో సి.ఈ.ఓ.గా బాధ్యతలు చేపట్టిన మొదటి క్వార్టర్‌లోనే(2011-12) లాభాల్లో 30శాతం వృద్ధి జరిగింది.

పవర్‌ఫుల్ ఉమెన్

చందాకొచ్చర్‌కు బ్యాంకింగ్‌ రంగం ఎన్నో అవార్డులతో సత్కరిం చగా, భారత ప్రభుత్వం.. అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్‌తో గౌరవించుకుంది. ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ చందా కొచ్చర్‌కు స్థానమివ్వగా, ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ ప్రతి ఏటా ప్రకటించే వ్యాపార రంగంలో ప్రభావశీలురైన మహిళల జాబితాలో 2005 నుంచి ఇప్పటివరకు చందా కొచ్చర్‌ టాప్‌ 50లో స్థానం లభిస్తూనే ఉండటం గమనార్హం. ఇక చందా కొచ్చర్‌ పవన శక్తి వ్యాపార వేత్త దీపక్‌ కొచ్చర్‌ను వివాహమాడి ఇద్దరు పిల్ల లకు జన్మనిచ్చి మాతృమూర్తిగా ప్రేమను పంచుతున్నారు.

భారత్‌ను ఆర్థిక సేవల కేంద్రంగా రూపొందించాలని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ అంటున్నారు. "ఆర్థిక సేవలు మరింత వృద్ధి చెందడానికి భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే... మరింత వృద్ధి సాధించాల్సిన అవసరముంది. ద్రవ్యలోటు, కరంట్ ఖాతా లోటు... ఈ రెండింటిని కట్టడి చేసి, స్థిరత్వాన్ని సాధించాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచాల్సిన బాధ్యత కేంద్రానిదే" అంటారు చందాకొ్చ్చర్. దేశంలో సమర్థవంతమైన, పటిష్టమైన శ్రమించే వాతావరణాన్ని సృష్టించాల్సి ఉందని, ఇందుకోసం ప్రజలందరూ కష్టపడాలని సూచిస్తున్నారు చందాకొచ్చర్.