మలేరియాకు మందును కనుక్కోవడంతో జార్ఖండ్ శాస్త్రవేత్త కృషి

మలేరియా పారసైట్ మనిషి శరీరంలో ఎలా బతుకుతుంది..?మన రక్తంలో దానికి సాయపడుతున్న ప్రోటీన్‌ను గుర్తించిన మహ్మద్ ఆలం..లండన్ లీసెస్టర్ యూనివర్సిటీ పరిశోధనలు ..ఏటా మలేరియా బాధితులు 20 కోట్ల మంది, చనిపోతోంది 5లక్షల మంది ..ఆలం పరిశోధనతో కొత్త మందు తయారీకి రోడ్ మ్యాప్ రెడీ ..

మలేరియాకు మందును కనుక్కోవడంతో జార్ఖండ్ శాస్త్రవేత్త కృషి

Friday September 18, 2015,

3 min Read

చిన్నతనంలో తాను ఎదుర్కొన్న విషజ్వరానికి తానే పెద్దయ్యాక మందు కనిపెడతానని..ఆలం అనుకుని ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆయనే ప్రాణాంతక జ్వరమైన మలేరియాను తగ్గించే ఓ మెడిసిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. జార్ఘండ్‌లోని లోహార్ దర్గాకి చెందిన వారు డాక్టర్ ఆలమ్. లండన్‌లోని ప్రతిష్టాత్మక లీసెష్టర్ యూనివర్సిటీ..లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సభ్యులతో కలసి కైనేజ్ అనే ప్రోటీన్‌ను పని చేయకుండా ఆపితే మలేరియాను నివారించవచ్చనే విషయాన్ని కనుగొన్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో కలిసి తమ ప్రయోగాల ఫలితాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ అనే ఓ జర్నల్‌లో ప్రకటించారు. వీరి ప్రయోగం సక్సెస్ అయితే మలేరియా మహమ్మారికి ఇక ఎవరూ భయపడనవసరం లేదని చెప్తున్నారు.

మహ్మద్ ఆలం గురించి టూకీగా

" మేం చేసిన పరిశోధన ఫలితాలపై యావత్ శాస్త్రవేత్తల్లో గొప్ప ఉత్సుకత నెలకొంది. మేం మలేరియా పరాన్నజీవి మానవశరీరంలో ఎలా బతకగలుగుతుందీ చెప్పడంతో పాటు ఆ క్రమంలో చోటు చేసుకునే జీవరసాయన పధ్దతులు కూడా తెలుసుకోగలిగాం. దాన్ని నిరోధించడానికి అవసరమైన మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు ఎలాంటి కాంపోజిషన్..డ్రగ్స్ డిజైన్ చేయాలో కూడా తెలుసుకునే వీలు కలిగింది. మలేరియా కారక జీవి యొక్క జీవన విధానాన్ని నిరోధించేలా ఈ మెడిసిన్స్ తయారు చేసుకోవచ్చు. తద్వారా మలేరియాను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు" అని చెప్పారు మహ్మద్ ఆలం.

" నా చిన్నతనంలో రెండు మూడు సార్లు నాకూ మలేరియా జ్వరం వచ్చింది. అప్పట్నుంచే మలేరియాకు మందు కనుక్కోవాలని.. వ్యాక్సిన్లు తయారు చేయాలని అనుకునేవాడిని.." 

మహ్మద్ ఆలం రాంచీలో బయోటెక్నాలజీ డిగ్రీ పూర్తి చేసి.. పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.

మలేరియా వ్యాప్తి చెందే విధానం(దోమకాటు)

మలేరియా వ్యాప్తి చెందే విధానం(దోమకాటు)


ప్లాస్మోడియం పాల్సీఫామ్ (మలేరియా కారక జీవి) తన లైఫ్ సైకిల్‌ను ఎలా గడుపుతుందో... అదెలా విస్తరిస్తుందో తెలుసుకోవడానికి లీసెస్టర్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఆండ్రూ టోబిన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనా బృందంలో సభ్యుడయ్యారు. తర్వాత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్‌లోని టాక్సికాలజీ యూనిట్ లో చేరారు. అక్కడే మలేరియా పారసైట్‌లోని బయోకెమికల్ విధానాలను స్టడీ చేసేందుకు ఫాస్పోప్రొటెమిక్స్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అనుసరించినట్టు చెప్తారు మహ్మద్ ఆలం.

మలేరియా, టైఫాయిడ్ దోమ కాటుతోనే వస్తాయని అందరికీ తెలుసు. ఐతే అది మలేరియా విషయంలో ఎలా జరుగుతుందంటే...ఓ విషపూరితమైన దోమ లోపల ఉన్న మలేరియా కారక జీవి ప్లాస్మోడియమ్ పాల్సీఫామ్.. ఆ దోమ కుట్టడం ద్వారా.. మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. మనిషి ఎర్ర రక్త కణాల్లోకి చేరి.. అక్కడే వృధ్ది చెందుతుంది. ఆ ఆర్బీసీలో పాల్సీఫామ్ జీవించడానికి, విస్తరించడానికి అవసరమైన ప్రొటీన్లను గుర్తించి..ఆ సదరు ప్రోటీన్‌ను ఆపడం ద్వారా... మలేరియా కారక జీవిని నశింపజేశారు మహ్మద్ ఆలం టీమ్. ఇది మలేరియాను నిరోధించే కొత్త మందును కనిపెట్టేదిశగా పడిన ముందడుగుగా చెప్పుకోవాలి..

అనుసరించిన విధానం

మహ్మద్ ఆలం, ఇతర సైంటిస్టులు చేస్తున్న పరిశోధనకు యూకేలోని ఎమ్మార్సీ అండ్ వెల్ కమ్ ట్రస్ట్ ఫండింగ్ చేస్తోంది. ఈ సైంటిస్టుల బృందం చేస్తున్న ప్రయోగాల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రేంజ్ విధానాలను ఉపయోగించి.. మలేరియా పారసైట్ యొక్క జీవరసాయన జీవన పద్దతులను పరిశోధించారు. ఓ జీవి యొక్క డీఎన్ఏలో ఉండే జెనెటిక్ మెటీరియల్‌ను పరిశోధిస్తూ.. ఆ జీవిని బతికించాలన్నా..నశింపజేయాలన్నా సింథటిక్ (అంటే ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన) ప్రోటీన్లను ప్రవేశపెట్టడం ద్వారా సాధ్యమవుతుందని ప్రాధమికంగా సైంటిస్టులు గుర్తించారు. సింథటిక్ కెమికల్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ జీవి.. డీఎన్ఏలో మార్పు చెందడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

కైనేజ్..(PfPKG)అనే ప్రోటీన్ మలేరియా పారసైట్ మానవ రక్తకణాల్లోజీవించడానికి కారణమవుతోందని కనుగొన్నారు. దీని ఆధారంగానే భవిష్యత్తులో ఔషధాలు రూపొందించి మలేరియా క్రిమిని నాశనం చేయవచ్చని తేల్చారు. అదే సమయంలో ఆ మందులు వాడిన చిన్నపిల్లలకు.. గర్భిణులకు ఎలాంటి హానీ కలుగకుండా కూడా డ్రగ్ డిజైన్ చేయవచ్చని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సైంటిస్టులు చెప్తున్నారు.

పరిశోధనా బృందాన్ని పర్యవేక్షిస్తున్న ప్రొఫెసర్ టోబిన్ " ఇదే బ్రేక్ త్రూ .. మలేరియా క్రిమి మనిషి శరీరంలో ఎలా బతుకుతుందో ..రెడ్ బ్లడ్ సెల్స్‌పై తన ప్రభావాన్ని ఎలా చూపుతుందో కనుగొన్నాం. భవిష్యత్తులో మలేరియా కారకజీవిని నివారించడానికి ఎలాంటి మందులు తయారు చేయాలో ఫార్మకాలజీ వారికి తెలిపే ఓ పద్దతిని ఇప్పుడు మేం ఆవిష్కరించాం. డ్రగ్ డిజైన్ ఆదే పద్దతిలో తయారైతే..ఎలాంటి హానికారక సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మలేరియాను సులువుగా అరికట్టవచ్చు.."అని చెప్పారు..

ఫ్యాక్ట్స్ & ఫిగర్స్..ఫ్యూచర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం..ప్రతీ ఏటా 20 కోట్ల మంది మలేరియా బారిన పడుతున్నారు. వారిలో 5లక్షల మంది మరణించడం విచారకరమైన సత్యం. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో కూడా ఓ దోమ కాటుకు.. మనుషులు చనిపోవడం ఎంత విషాదం..!? అందుకే ఇప్పుడు మహ్మద్ ఆలం బృందం ఆవిష్కరించిన ప్రయోగ ఫలితం మలేరియా జ్వరానికి సరైన మందు తయారు చేయడంలో ఓ రోడ్ మ్యాప్‌లా ఉపయోగపడుతుందనడంలో సందేహమే లేదు..!