ఈ స్వీట్లు 24 కేరట్స్ గోల్డ్..! ఒక్కసారి తిన్నారంటే జన్మలో మరిచిపోరు.!!

ఈ స్వీట్లు 24 కేరట్స్ గోల్డ్..! ఒక్కసారి తిన్నారంటే జన్మలో మరిచిపోరు.!!

Monday January 25, 2016,

3 min Read

భారతీయ సంప్రదాయంలో మిఠాయిలది ప్రత్యేక స్థానం. నోరు తిపి కానిదే ఏ పండగా పరిపూర్ణం కాదు. శుభవార్త చెప్పినా, శుభకార్యం చేసినా- తీయని వేడుకలా ఉండాలి! మిడిల్ క్లాస్ వాళ్లు షాపుల్లో దొరికే రెగ్యులర్ స్వీట్ల వైపు మొగ్గు చూపుతారు. అదే శ్రీమంతులైతే అకేషన్ మరింత రిచ్ గా ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ గోల్డ్ స్వీట్స్!

image


ఐశ్వర్యా గోయల్! ఏజ్ 21. వయసు చిన్నదే, కాని ఆలోచన పెద్దది. నిజానికి గోల్డ్ స్వీట్స్ అన్న కాన్సెప్టే సరికొత్తది. ఆ డిఫరెంట్ థింకింగే ఆమెను ఇవాళ సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్ గా నిలబెట్టింది.

ఎవరీ ఐశ్వర్య?

ఢిల్లీకి చెందిన మార్వాడీ ఫ్యామిలీలో పుట్టింది ఐశ్వర్యా గోయల్. సంప్రదాయమైన కుటుంబం. తండ్రి బిజినెస్ మేన్. ఐశ్వర్య మహా చురుకైన అమ్మాయి. అమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే రకరకాల ప్రయోగాలు చేసేది. ముఖ్యంగా బిజినెస్ కమ్యూనిటీలో ఉండే వాళ్లు బంగారాన్ని ఆరాధించడం చిన్నతనం నుంచే గమనించేది. పండగైనా పబ్బమైనా బంగారం, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ అని గుర్తించింది. విడివిడిగా కాకుండా ఆ రెంటినీ కలిపి కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. అందులో నుంచే ఈ గోల్డ్ స్వీట్ ఆలోచన పుట్టింది. ఎడిబుల్ గోల్డ్ (మిఠాయిల తయారీలో ఉపయోగించేది) తయారు చేసి అమ్మడమంటే మాటలు కాదు. తనకంటూ ఒక మార్కెట్ సృష్టించుకొని, ఒక కొత్త కాన్సెప్ట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలి. అందుకు చాలా సమయం, ఆలోచన, ప్రణాళిక కావాలి. కానీ ఆమె భయపడలేదు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా బిజినెస్ లోకి దిగింది.

image


బంగారమే ఎందుకు?

గోల్డ్ హోదాకు, బ్యూటీకి చిహ్నమని మనకు తెలుసు. కానీ బంగారం ఆరోగ్యానికీ మేలు చేస్తుందట! పూర్వం చక్రవర్తులు బంగారం(ఎడిబుల్ గోల్డ్) తో తయారు చేసిన మిఠాయిలు తినేవాళ్లట! కాలక్రమంలో ఆ సంప్రదాయం కనుమరుగైపోయింది. ఆ ట్రెడిషన్ కు మళ్లీ పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా స్వర్ణ్‌ అమృత్ ను స్టార్ట్ చేశారు ఐశ్వర్య. 2014లో గుర్గావ్ లో ఒక స్టార్టప్ గా కంపెనీ ప్రారంభమైంది. ఇప్పుడు 50 మంది స్టాఫ్ ఉన్నారు. ప్లానింగ్, మార్కెటింగ్, క్రియేటివిటీకి ప్రత్యేకంగా కోర్ టీమ్ ఉంది. స్వర్ణ్‌ అమృత్ లో మిఠాయిలను, బంగారాన్ని మేళవించి కొత్త రకం స్వీట్లు తయారు చేస్తారు. గోల్డ్ స్వీట్లు గిఫ్ట్ గా ఇస్తే ఫుల్ లగ్జరీగా ఉంటుంది. కాకపోతే అవి కొంచెం కాస్ట్ లీ!

ఎలా తయారు చేస్తారు?

ముడి సరుకు రూపంలో దొరికే స్వచ్ఛమైన బంగారం నుంచి ఎడిబుల్ గోల్డ్ తయారు చేస్తారు. 24 కేరట్స్ ప్యూర్ ఎడిబుల్ గోల్డ్ తో ఒక్క స్వీటు ముక్క తయారు చేయడానికి పావుగంట నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఎడిబుల్ గోల్డ్ అంత త్వరగా పాడవదు. కాకపోతే ఏదైనా మిఠాయిలో మిక్స్ చేసిన తర్వాత చాలా రోజులు అలాగే ఉంచితే షైనింగ్ పోతుంది. బంగారం అన్నాక ఆ మాత్రం మెరుపులు ఉండాలి కదా! అందుకే స్వర్ణ్ అమృత్ లో ఆర్డర్ మీదనే స్వీట్లు తయారు చేస్తారు. వెబ్ సైట్ లేదా ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. కస్టమర్ల రుచి, అభిరుచికి తగ్గట్టుగా మిఠాయిలు తయారు చేయడమే వీళ్ల స్పెషాలిటీ!

ఇకపోతే స్వర్ణ్ అమృత్ లో తయారయ్యే ప్రతీ మిఠాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మధ్యే 24 కేరట్ గోల్డ్ బ్రిక్ అనే కొత్త రకం స్వీటొకటి తయారు చేశారు. దాని మీద కాపీరైట్, కస్టమర్ పేరు/బ్రాండ్ కూడా ముద్రించారు.

ఎడిబుల్ గోల్డ్ బ్రిక్స్

ఎడిబుల్ గోల్డ్ బ్రిక్స్


ఒక కొత్త ఐడియాకు కస్టమర్ల నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. విభిన్నమైన, వినూత్నమైన ఆలోచనకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. ఇప్పడు మా కస్టమర్లు నాలుగింతలు పెరిగారు- ఐశ్వర్య గోయల్

పేరెంట్స్ ని ఒప్పించి..

అసలే మార్కెట్లో గోల్డ్ రేటు మండిపోతోంది. అలాంటిది బంగారంతో స్వీట్లు తయారు చేయాలంటే గట్స్ కావాలి. కొత్త రకమైన బిజినెస్ కోసం పేరెంట్స్ ను ఒప్పించడం దగ్గర్నుంచి, ఇన్వెస్టర్లను మెప్పించడం దాకా- ఐశ్వర్య చాలా కష్టాలే భరించింది. సమస్యల్ని అధిగమించింది. చివరికి అనుకున్నది సాధించింది. పేరెంట్స్ సపోర్ట్, సాధించాలన్న తపనే తననీ స్థాయిలో నిలబెట్టాయంటారామె. ఇమేజెస్ బజార్ డాట్ కామ్ సీఈవో సందీప్ మహేశ్వరి.. స్వర్ణ్ అమృత్ లో తొలి ఇన్వెస్టర్. ఐఐటీ లేదా ఐఐఎం పట్టా, కార్పొరేట్ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే పెట్టుబడులు రావని స్టార్టప్ సిస్టమ్ లో ఒక అభిప్రాయం ఉంది. కానీ అది నిజం కాదు. చేసే పనిలో నిజాయితీ ఉంటే పెట్టుబడులు అవే వస్తాయని ఐశ్వర్య అంటున్నారు.

వ్యాపార అనుభవం నుంచి ఐశ్వర్య చెప్పిన కొన్ని పాఠాలు:

1. ఒకసారి ట్రై చేసి చూద్దాం, పోయేదేముంది- అన్న యాటిట్యూడ్ ఎప్పుడూ ఫెయిల్ అవుతుంది. చేసే పని మీద నమ్మకం ఉంటే ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. లాజికల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి. గో - గెటర్ యాటిట్యూడ్ తప్పనిసరి.

2. బిజినెస్ లో ఎప్పుడూ ఒకరిని ఫాలో కావొద్దు. పనిలో నిజాయితీ ఉంటే జనమే మీ వెంట వస్తారు.

3. నిరంతరం ఇతరులకు మార్గదర్శిగా ఉండండి. ఒకవేళ మీరు ఆంట్రప్రెన్యూర్ అయితే- టెక్నికల్ నాలెడ్జ్ కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ పై దృష్టి పెట్టండి.

ఇక 2016లోనూ ఐశ్వర్య కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. లగ్జరీ గిఫ్ట్ ప్రోడక్ట్స్ కోసం జనం ముందుగా స్వర్ణ్ అమృత్ వైపే చూడాలన్నది ఆమె టార్గెట్! నిజంగా దేశానికిప్పుడు కావాల్సింది ఇలాంటి యువ ఆంట్రప్రెన్యూర్సే!