2 లక్షల మంది యూజర్లు, కోటిన్నర ప్రశ్నలకు సమాధానాలు... విద్యార్థులకు చేరువైన 'టెక్స్ట్‌ బుక్'

2 లక్షల మంది యూజర్లు, కోటిన్నర ప్రశ్నలకు సమాధానాలు... విద్యార్థులకు చేరువైన 'టెక్స్ట్‌ బుక్'

Monday August 24, 2015,

4 min Read

ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశం కావడంతో భారత్ అన్ని రకాల వ్యాపారస్తులకూ కూడా ఓ మంచి మార్కెట్. నేటి రోజుల్లో విద్య కూడా ఓ వ్యాపారంగానే మారిపోయింది. కార్పొరేట్ స్కూళ్లు, టెక్నో స్కూళ్లు, టాలెంట్ స్కూళ్లు, కాన్సెప్ట్ స్కూళ్లు... ఇలా వివిధ పేర్లతో రకరకాల పాఠశాలలు మార్కెట్లో పుట్టుకొస్తున్నాయి. విద్యారంగానికి సంబంధించిన స్టార్టప్‌లకు కూడా భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. కేజీ నుంచి పీజీ దాకా ప్రస్తుతం మన దేశంలో అన్ని స్కూళ్లు, కాలేజీల మధ్య విపరీతమైన పోటీ నెలకొని ఉంది. చదువుతోపాటే పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ కూడా అందిస్తామంటూ ఎన్నో సంస్థలు విద్యార్థులను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ నిజంగా విద్యార్థిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్ది, ఈ పోటీ ప్రపంచంలో తన కాళ్లపై తాను నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నాయా ? ఇదొక మిలియన డాలర్ల ప్రశ్నే అనడంలో సందేహం లేదు.

image


ఇటీవల కాలంలో విద్యా వ్యాపారం కూడా కొత్త పుంతలు తొక్కింది. అదంతా ఆన్ లైన్ మహిమే. చదువుకోవడానికి కావలసిన అన్ని రకాల వనరులు... అంటే టీచర్లు, లెక్చరర్లు చెప్పిన పాఠాలు వీడియో రూపంలో లభ్యమవుతున్నాయి. వాటిలో ఏమైనా సందేహాలొస్తే... ఆన్‌లైన్‌లోనే నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. మన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి అవసమైన పరీక్షలు కూడా ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఈ తరహా పరీక్షలకు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు వాటికోసం మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ముంబై, ఢిల్లీ ఐఐటీలలో చదువు పూర్తి చేసుకున్న కొందరు పాత విద్యార్థులకు ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఈ రెండు ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు గేట్ పరీక్షలో మంచి పర్సెంటేజ్ తెచ్చుకునేందుకు అవసరమైన శిక్షణ, ప్రాక్టీస్ కల్పించే ఉద్దేశంతో ఓ ఆన్ లైన్ అప్లికేషన్ రూపొందించాలనుకున్నారు. అదే 2014 జనవరిలో ప్రారంభమైన “టెస్ట్ బుక్”. అయితే అప్పటికే వారి మదిలో పెద్ద లక్ష్యం సిద్ధమై ఉంది. దేశంలో ఉన్న అన్ని పోటీ పరీక్షలకు దీన్ని ఉపయోగించుకునేలా అభివృద్ధి చేయాలనేది వారి ఆలోచన.

ముంబై ఐఐటీ పూర్వ విద్యార్థులు అశుతోష్ కుమార్, నరేంద్ర అగర్వాల్, మనోజ్ మున్నా, ప్రవీణ్ అగర్వాల్, ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థులు యాదవేందర్ చంపావత్, అభిషేక్ సాగర్‌లు కలసి ఓ బృందంగా ఏర్పడి “టెస్ట్ బుక్” ఆలోచనకి వాస్తవ రూపాన్నిచ్చారు. “టెస్ట్ బుక్” సీఈఓ అశుతోష్‌కి అంతకుముందే విద్యారంగంపై మంచి అవగాహన ఉంది. దాదాపు 7 సంవత్సరాలుగా దానిపైనే పనిచేస్తున్నారు. సీఎంఓ నరేంద్ర కూడా విద్యారంగానికి సంబంధించిన మొబైల్ అప్లికేషన్స్ రూపొందించారు. గతంలో ఒరాకిల్ కంపెనీలో పనిచేసిన యాదవేందర్ ప్రస్తుతం “టెస్ట్ బుక్”కి టెక్నాలజీ హెడ్. ఆండ్రాయిడ్ యాప్‌కి సంబంధించిన అంశాలన్నీ అభిషేక్ చూసుకుంటారు. ఈయన అడోబ్ మాజీ ఉద్యోగి. మనోజ్ ప్రోడక్ట్ హెడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక మిగిలింది కంటెంట్. గతంలో డెలాయిట్‌లో పనిచేసిన అనుభవం ఉన్న ప్రవీణ్ 60 మంది సభ్యులున్న కంటెంట్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.

image


2014 అక్టోబరులో “టెస్ట్ బుక్”లో కొత్త పరీక్షలను చేర్చారు. క్యాట్, ఎస్బీఐ పీవో, క్లర్క్, ఐబీపీఎస్ పీవో పరీక్షలతో పాటు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన సమాచారాన్ని అప్ లోడ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఈ యాప్‌లో 55,000 మంది యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో వీరికి “టెస్ట్ బుక్”ను మరింత అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులను సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. లెట్స్ వెంచర్, ఆహ్ వెంచర్స్ కంపెనీలతో పాటు మరికొంతమంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ముందుకు రావడంతో రూ.1.5 కోట్లను సమీకరించారు.

“టెస్ట్ బుక్” తన యూజర్లందరికీ ఉచితంగానే మాక్ టెస్ట్స్ అందిస్తోంది. మరింత కఠిన పరీక్షలు కావాలనుకునే వారికి వివిధ రకాల అప్ గ్రేడ్ ప్లాన్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. “టెస్ట్ బుక్” ద్వారా యూజర్లు ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు, అవి సరైనవో కాదో పరిశీలించుకోవచ్చు. వాటికి అవసరమైన వివరణలు చూడవచ్చు. వీటన్నింటితో పాటు ఇతర విద్యార్థులతో పోలిస్తే (యూజర్లు) తమ ర్యాంక్ ఎంత ఉంది ? గత పరీక్షలకు, ఇప్పటికీ ఏమైనా మెరుగయ్యిందా ? లేదా ? వంటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. పోటీ పరీక్షల ప్రకటనలకు సంబంధించిన అలర్ట్‌లను కూడా పొందవచ్చు. 2015 జూన్ నాటికి యూజర్ల సంఖ్య 2.1 లక్షలు దాటింది. 1.37 కోట్ల ప్రశ్నలకు యూజర్లు సమాధానాలిచ్చారు.

మార్కెటింగ్, ప్రమోషన్

మార్కెటింగ్ కోసం “టెస్ట్ బుక్” ప్రధానంగా సోషల్ మీడియాపైనే ఆధారపడింది. దీంతోపాటు కాలేజీలు, యూనివర్శిటీల్లో విద్యార్థులకు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆఫ్ లైన్ మార్కెటింగ్‌పై వీరు ఇంకా ఎలాంటి ప్రణాళికలూ సిద్ధం చేసుకోలేదు. అయితే వీరితో ఉన్న చిన్న సేల్స్ టీమ్ సహాయంతో... చిన్న చిన్న ట్రైనింగ్/కోచింగ్ సెంటర్లను కలసి, అక్కడికి వచ్చే విద్యార్థులకు తమ ప్రొడక్ట్ ద్వారా పరీక్షలు నిర్వహించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

“నాణ్యమైన కంటెంట్, పరీక్షలు అందిస్తే... అది తప్పకుండా విద్యార్థులకు చేరువ అవుతుంది అనేది మా బలమైన నమ్మకం. ఆ దిశగానే మేం ప్రయత్నించాం. దాని ఫలితమే 18 నెలల్లో 2.1 లక్షల యూజర్లు. విజయం సాధించామనే అనుకుంటున్నాం. అయితే ఇంతటితో ఆగిపోవట్లేదు. ఈ సంఖ్యను మూడింతలు చేయాలి. దానికోసం “టెస్ట్ బుక్”లో కొన్ని మార్పులు చేస్తున్నాం” అంటున్నారు అశుతోష్.

సాధారణంగా బ్యాంక్ పోటీ పరీక్షలు సంవత్సరం పొడవుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. దీన్ని గమనించిన “టెస్ట్ బుక్” బృందం బ్యాంకింగ్ పరీక్షల విభాగానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ తర్వాత గేట్ పరీక్షల కోసం ఎక్కువ మంది విద్యార్థులు “టెస్ట్ బుక్”ని ఎంచుకుంటున్నారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో నాణ్యమైన ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఖరీదైన స్మార్ట్ ఫోన్లను అందరూ సమకూర్చుకోలేకపోవచ్చు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఈ అప్లికేషన్ ఎలాంటి స్మార్ట్ ఫోన్లోనైనా, తక్కువ ఇంటర్నెట్ స్పీడ్‌తో కూడా పనిచేసేలా రూపొందించారు.

image


మొబైల్ యాప్

2015 జూన్ వరకూ “టెస్ట్ బుక్” కేవలం ఇంటర్నెట్ లో మాత్రమే లభ్యమయ్యేది. అయితే పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా జూన్‌లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను విడుదల చేసింది “టెస్ట్ బుక్” బృందం. తక్కువ కాలంలోనే దీన్ని 10,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. విద్యారంగానికి సంబంధించిన ఉచిత కొత్త అప్లికేషన్లలో టాప్ 5 లో నిలిచింది. డెస్క్ టాప్ యూజర్లుగా ఉన్న 2.1 లక్షల మందిని యాప్‌ను కూడా ఉపయోగించేలా చేయడం, మరింత ఎక్కువ మందికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే వీరి ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం మొబైల్ యాప్‌లో అన్ని రకాల పరీక్షలనూ ఉంచలేదు. తక్కువ కంటెంట్ అందుబాటులో ఉంచారు. త్వరలోనే మరింత సమాచారాన్ని, పరీక్షలను ఆప్ లోకి అప్ లోడ్ చేయడానికి సిద్ధమవుతోంది అశుతోష్ బృందం. “యూజర్లు తాము సమాధానాలిచ్చే ప్రతి ప్రశ్నకూ కొన్ని ఎక్స్ పీ పాయింట్లు గెల్చుకుంటారు. ఈ పాయింట్లతో “టెస్ట్ బుక్” ఆప్ లోని ప్రీమియమ్ ఫీచర్లను పొందవచ్చు. టెస్టులను రాయవచ్చు అంటారు” అశుతోష్. “స్ట్రీక్స్” అనే ఫీచర్ ద్వారా “టెస్ట్ బుక్” యాప్‌ని తరచుగా ఉపయోగించేవారిని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోటీ, భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం “టెస్ట్ బుక్”కి గట్టి పోటీ ఇస్తున్న యాప్ టాపర్. 2015 మే నెలలో టాపర్ రూ.65 కోట్ల నిధులను సమీకరించింది. అలాగే మాక్ బ్యాంక్ (బ్యాంకింగ్ పోటీ పరీక్షల అప్లికేషన్), ఎంబైబ్, 100మార్క్స్, ఎగ్జామిఫై, మేరా టెస్ట్ బజార్, ఆలివ్ బోర్డ్... ఇవన్నీ ఇప్పటికే మార్కెట్లో బాగా నిలదొక్కుకుని ఉన్నాయి. ఇవన్నీ “టెస్ట్ బుక్”కి గట్టి పోటీదారులే.

“టెస్ట్ బుక్” ఐవోఎస్ వెర్షన్ కూడా విడుదల చేసేందుకు అశుతోష్ బృందం ప్రయత్నిస్తోంది. షేరింగ్ ఆప్షన్స్ పై మరింతగా దృష్టి సారించనుంది. అంతే కాదు సిరీస్ ఎ ఫండింగ్ కోసం కూడా యత్నాలు తీవ్రతరం చేసింది. త్వరలో ఇవి కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

website